త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Budget 2026 | ఫోన్లు, టీవీలు కొనాలనుకుంటున్నారా..! బడ్జెట్‌ తర్వాత ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..?

Budget 2026 | ఫిబ్రవరి ఒకటిన కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నది. నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కోసం సామాన్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమకు ఏమైనా ఊరట కల్పిస్తారా? అన్న ఆశతో ఉన్నారు. అయితే, బడ్జెట్‌తో ఎలక్ట్రిక్‌ వస్తువుల ధరలు తగ్గుతాయని చాలామంది ఆశిస్తున్నారు. అయితే, పరిశ్రమ వర్గాలు మాత్రం రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

P

Business | Published On Jan 19, 2026, 1.01 pm IST

Budget 2026 | ఫోన్లు, టీవీలు కొనాలనుకుంటున్నారా..! బడ్జెట్‌ తర్వాత ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..?
Advertisement

Budget 2026 | ఫిబ్రవరి ఒకటిన కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నది. నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కోసం సామాన్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమకు ఏమైనా ఊరట కల్పిస్తారా? అన్న ఆశతో ఉన్నారు. అయితే, బడ్జెట్‌తో ఎలక్ట్రిక్‌ వస్తువుల ధరలు తగ్గుతాయని చాలామంది ఆశిస్తున్నారు. అయితే, పరిశ్రమ వర్గాలు మాత్రం రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ మొబైల్స్‌, టీవీలు, ల్యాప్‌టాప్‌ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, హై పర్ఫామెన్స్‌ కంప్యూటింగ్‌ రంగాల్లో వినియోగం వేగంగా పెరగడమేనని చెబుతున్నారు. ఈ వేగం కారణంగా మెమరీ చిప్‌ల డిమాండ్‌ జోరందుకుంది. దాంతో సరఫరా తక్కువగా ఉండడం.. డిమాండ్‌ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ధరల మోత మోగుతున్నది. ఈ ప్రభావం స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ తయారీదారులపై పడుతున్నది.

8శాతం దాకా పెరిగే ఛాన్స్‌..

రాబోయే రెండు నెలల్లో ఎలక్ట్రానిక్‌ ఉత్పతుల ధరలు దాదాపుగా నాలుగు నుంచి ఎనిమిది శాతం వరకు పెరిగే ఛాన్స్‌ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్‌-డిసెంబర్‌ మధ్య స్మార్ట్‌ఫోన్‌ మొబైల్స్‌ ధరలు 21శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది సైతం ధరలు ఒకేసారి కాకుండా ప్రతి త్రైమాసికం లేదంటే.. పలు సందర్భాల్లో నెలవారీగా పెరగవచ్చని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం.. ప్రస్తుతం మెమరీ మార్కెట్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఉన్నది. గత త్రైమాసికంలో ధరలు 50శాతం దాకా పెరిగాయి. ప్రస్తుత త్రైమాసికంలోనూ ఇప్పటి వరకు 40 నుంచి 50శాతం వరకు పెరిగాయి. రాబోయే ఏప్రిల్‌-జూన్‌ వరకు మరో 20శాతం వరకు పెరుగుతుందని అంచనా. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పరిశోధనా విభాగం డైరెక్టర్‌ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ మెమరీ చిప్స్‌ భారం ఇప్పటికే మొదలైందని.. పలు బ్రాండ్‌ వినియోగదారులపై ఈ భారాన్ని మోపుతున్నాయన్నారు.

ఇప్పటికే ధరలు పెంచిన మొబైల్‌ కంపెనీలు..

వివో, నథింగ్ తదితర కంపెనీలు జనవరిలోనే తమ హ్యాండ్‌సెట్ ధరలను రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అదే సమయంలో శామ్‌సంగ్‌ తదితర బ్రాండ్స్‌ మాత్రం ధరల పెంపు జోలికి వెళ్లలేదు. క్యాష్‌ బ్యాక్‌, డిస్కౌంట్‌ ఆఫర్లలో కోత విధించాయి. ఈ ఏడాదితో పాటు రాబోయే సంవత్సరం సైతం చిప్స్‌ ధరలు తగ్గే ఛాన్స్‌ లేదని, కొత్త మోడల్స్‌ లాంచ్‌ సమయంలో కంపెనీలు ఖర్చులను పరిగణలోకి తీసుకుంటాయని తరుణ్‌ పాఠక్‌ పేర్కొన్నారు. ధరలు అదుపులో ఉంచేందుకు నాణ్యత విషయంలో రాజీపడే అవకాశాలు లేకపోలేదన్నారు. ధరల పెరుగుదలకు చిప్స్‌ సరఫరా పెద్ద సవాల్‌గా మారుతోందని ఆయన పేర్కొన్నారు. కోడాక్, థామ్సన్, బ్లాపంక్ట్ వంటి టీవీ బ్రాండ్స్‌ విక్రయిస్తున్న సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సంస్థ ఆర్డర్లలో కేవలం పదిశాతం మాత్రమే సరఫరా చేస్తుందని.. తయారీ, సరఫరా చైన్‌పై ఒత్తిడి పెంచుతోందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ధరలు పెంచక తప్పదన్న ఇండస్ట్రీ వర్గాలు..

సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ.. నవంబర్‌లో ధరలు 7 శాతం పెంచగా.. డిసెంబర్‌లో మరో 10 శాతం పెరిగాయన్నారు. ఫిబ్రవరిలో 4 శాతం పెంపు ప్రణాళిక ఉందన్నారు. రాబోయే రిపబ్లిక్ డే సేల్‌లో గతంలో మాదిరిగా భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు ఉండబోవన్నారు. రిటైల్‌ ఇండస్ట్రీ వర్గాలు స్పందిస్తూ.. ల్యాప్‌టాప్‌ ధరలు ఇప్పటికే 8శాతం వరకు పెరిగాయని పేర్కొన్నాయి. ప్రధాన టీవీ కంపెనీలు సైతం త్వరలోనే ధరలు పెంచనున్నట్లుగా సంకేతాలిచ్చాయి. గ్రేట్ ఈస్టర్న్ రిటైల్ డైరెక్టర్ పుల్కిత్ బైద్ మాట్లాడుతూ ధరల పెరుగుదల డిమాండ్‌పై తక్షణం ప్రభావం చూపుతుందని, ఫలితంగా వినియోగదారులు వస్తువుల కొనుగోళ్లను వాయిదా వేసుకునే అవకాశం ఉందన్నారు. ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) లెక్కల ప్రకారం.. నవంబర్–డిసెంబర్ కాలంలోనే స్మార్ట్‌ఫోన్ ధరలు దాదాపు 21 శాతం వరకు పెరిగాయి. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకుపైగా మొబైల్ స్టోర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసోసియేషన్‌.. రాబోయే నెలల్లో ధరల పెంపు 30శాతం వరకు ఉండవచ్చని సంకేతాలు ఇచ్చింది. అమ్మకాలపై ప్రతికూల ప్రభావం ఉన్నా పెంచక తప్పదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొటున్నాయి.

మెమరీ చిప్స్‌ ధర పెరగడమే కారణం..

ఈ సందర్భంగా అసోసియేషన్‌ చైర్మన్‌ కైలాష్‌ లఖ్యాని మాట్లాడుతూ.. ధరలు పెరిగితే 12శాతం వరకు కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందన్నారు. రూ.20వేల లోపు స్మార్ట్‌ మొబైల్స్‌పై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఈ ఏడాదిలో గతంలో అంచనా వేసిన 2శాతానికి మించి కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మెమరీ చిప్స్‌ ధర పెరగడం, రూపాయి విలువ పతనం కావడం తదితర కారణాలు మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. గతంలో 4జీబీ ఆర్‌డీఐఎంఎం మెమరీ ధర సెప్టెంబర్‌లో 255 డాలర్లు ఉండగా.. డిసెంబర్‌ నాటికి 450 డాలర్లకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి 700 డాలర్ల దాకా పెరగొచ్చని అంచనా. ఈ క్రమంలో బడ్జెట్‌ ధరలు తగ్గుతాయని ఆశించడం కష్టమేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement