త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadhar Update Charges | ఆధార్ అప్‌డేట్‌కు అధికంగా చార్జిలు వ‌సూలు.. అస‌లు ఎంత చెల్లించాలి..?

Aadhar Update Charges | మా గ్రామంలోని ఆధార్ కేంద్రంలో ఆధార్ అప్‌డేట్ చేయడానికి రూ.200 వసూలు చేస్తున్నారు. నాలుగు సార్లు అప్‌డేట్ చేయించుకున్నా మొత్తం రూ.800 తీసుకున్నారు, అయినా ఆధార్ ఇంకా అప్‌డేట్ కాలేదు. దయచేసి సహాయం చేయండి.. అంటూ ఒక వినియోగదారుడు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.

S

Business | Published On Jan 21, 2026, 6.44 am IST

Aadhar Update Charges | ఆధార్ అప్‌డేట్‌కు అధికంగా చార్జిలు వ‌సూలు.. అస‌లు ఎంత చెల్లించాలి..?
Advertisement

Aadhar Update Charges | మా గ్రామంలోని ఆధార్ కేంద్రంలో ఆధార్ అప్‌డేట్ చేయడానికి రూ.200 వసూలు చేస్తున్నారు. నాలుగు సార్లు అప్‌డేట్ చేయించుకున్నా మొత్తం రూ.800 తీసుకున్నారు, అయినా ఆధార్ ఇంకా అప్‌డేట్ కాలేదు. దయచేసి సహాయం చేయండి.. అంటూ ఒక వినియోగదారుడు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. తన పేరు, చిరునామా, గ్రామం వివరాలు వెల్లడించకపోయినా, ఆధార్ కేంద్రం నంబర్ 656 అని పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు వైరల్ కావడంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) స్పందించి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆధార్ అప్‌డేట్‌కు వసూలు చేసే ఫీజులపై స్పష్టత ఇచ్చింది. ఆధార్ నమోదు పూర్తిగా ఉచితం అని పేర్కొంది. అయితే అప్‌డేట్ చేసే సమాచార రకాన్ని బట్టి మాత్రమే ఫీజులు నిర్ణయించినట్లు తెలిపింది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన బయోమెట్రిక్ అప్‌డేట్‌ల విషయంలో ప్రత్యేక సౌకర్యం కల్పించినట్లు వివరించింది.

గ‌రిష్టంగా రూ.125 మాత్ర‌మే..

7 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లు 2026 సెప్టెంబర్ 30 వరకు ఉచితమని UIDAI స్పష్టం చేసింది. 5 నుంచి 7 ఏళ్లు, అలాగే 15 నుంచి 17 ఏళ్ల వయసు పిల్లలకు ఫొటో, వేలిముద్రలు, కంటి ఐరిస్ ను ఉచితంగా అప్‌డేట్‌ చేయనున్నట్లు తెలిపింది. 7 నుంచి 15 ఏళ్లు, అలాగే 17 ఏళ్లు పైబడినవారికి బయోమెట్రిక్ అప్‌డేట్‌కు రూ.125 మాత్రమే ఫీజు వసూలు చేయాలని పేర్కొంది. పేరు, చిరునామా, జన్మతేదీ వంటి డెమోగ్రాఫిక్ వివరాలు (ఒకటి లేదా ఎక్కువ ఫీల్డులు) మార్చుకోవాలంటే పన్నులతో కలిపి రూ.75 మాత్రమే ఫీజు నిర్ణయించినట్లు తెలిపింది. బయోమెట్రిక్ అప్‌డేట్ డెమోగ్రాఫిక్ మార్పులతో కలిపి చేసినా ఫీజు రూ.125కే పరిమితమని స్పష్టం చేసింది. ఈ-కేవైసీ లేదా ఆధార్ సెర్చ్ చేసి ఏ4 సైజ్ కలర్ ప్రింట్ తీసుకుంటే రూ.40 వసూలు చేయవచ్చని తెలిపింది.

మై ఆధార్ పోర్ట‌ల్‌లో జూన్ వ‌ర‌కు ఉచితం..

ఆన్‌లైన్‌లో myAadhaar పోర్టల్ ద్వారా చిరునామా అప్‌డేట్ చేసుకుంటే కూడా రూ.75 మాత్రమే ఫీజు ఉంటుందని UIDAI పేర్కొంది. అయితే డాక్యుమెంట్ అప్‌డేట్ సేవలను 2026 జూన్ 14 వరకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే ప్రజలు వెంటనే ఫిర్యాదు చేయాలని UIDAI సూచించింది. ఇందుకు అధికారిక ఆధార్ వెబ్‌సైట్ uidai.gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అవినీతి, నిబంధనల ఉల్లంఘనల పట్ల ఎంత మాత్రం స‌హించేది లేద‌ని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ అప్‌డేట్ ఫీజులపై తప్పుడు సమాచారం, అక్రమ వసూళ్లకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారిక మార్గదర్శకాలను మాత్రమే నమ్మాలని, అదనపు డబ్బులు చెల్లించవద్దని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement