త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Two Grooms One Bride | పెళ్లికూతురు ఒక్కరే.. వరులు ఇద్దరు: ఒకే మండపానికి రెండు బారాత్‌లు.. యూపీలో హైడ్రామా

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒకే వధువును పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు వరులు వేర్వేరుగా బారాత్‌తో రావడంతో పెళ్లి మండపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివాదం ముదరడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

J

Viral news | Published On Apr 13, 2026, 6.46 pm IST

Two Grooms One Bride | పెళ్లికూతురు ఒక్కరే.. వరులు ఇద్దరు: ఒకే మండపానికి రెండు బారాత్‌లు.. యూపీలో హైడ్రామా

సంక్షిప్త సారాంశం

అమ్రోహాకు చెందిన ఒక యువతికి మొదట మొరాదాబాద్‌కు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. అయితే, రెండు కుటుంబాల మధ్య విభేదాల కారణంగా పెళ్లి రద్దయింది. కానీ, అప్పటికే శుభలేఖలు పంచేయడంతో మొరాదాబాద్ వరుడు బారాత్‌తో మండపానికి వచ్చేశాడు. మరోవైపు, వధువు కుటుంబం ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు అదే రోజు సంభాల్‌కు చెందిన మరో యువకుడితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఇద్దరు వరులు ఒకేసారి మండపానికి చేరుకోవడంతో గొడవ మొదలైంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వధువు కుటుంబం ఇష్టప్రకారం కొత్తగా నిర్ణయించిన సంభాల్ వరుడితోనే పెళ్లి జరిపించారు.

Advertisement

Two Grooms One Bride | త్రినేత్ర.న్యూస్ : పెళ్లిళ్లలో రకరకాల విచిత్రాలు జరగడం మనం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఒక ఘటన మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఒకే పెళ్లికూతురి కోసం ఇద్దరు పెళ్లికొడుకులు ఏకకాలంలో ఊరేగింపు (బారాత్)తో రావడంతో ఆ పెళ్లి మండపం వద్ద హైడ్రామా నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

అసలేం జరిగిందంటే..

అమ్రోహాలోని ఒక ఫంక్షన్ హాల్‌లో పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వధువు కుటుంబ సభ్యులు సంభాల్ ప్రాంతం నుంచి వచ్చే పెళ్లికొడుకు బారాత్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతా సాఫీగా సాగుతోందనుకుంటున్న తరుణంలో.. పొరుగున ఉన్న మొరాదాబాద్ నుంచి పూలతో అలంకరించిన కారులో మరో పెళ్లికొడుకు తన బారాత్‌తో అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు వరులు తామే వధువును పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పడంతో బంధువులంతా షాక్ అయ్యారు.

మండపంలో టెన్షన్.. టెన్షన్

ఊహించని విధంగా 'డబుల్ బారాత్' రావడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటల యుద్ధం కాస్తా భౌతిక దాడికి దారితీసేలా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, భయాందోళనకు గురైన వధువు కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అసలు ట్విస్ట్ ఇక్కడే

పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వధువుకి మొదట మొరాదాబాద్‌కు చెందిన ఒక బంధువుతో వివాహం నిశ్చయమైంది. అయితే, పెళ్లికి కొద్ది రోజుల ముందు రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు.

కానీ, అప్పటికే బంధువులందరికీ పెళ్లి కార్డులు పంచేయడంతో.. మొరాదాబాద్ కుటుంబం పెళ్లి రద్దును లెక్కచేయకుండా నేరుగా మండపానికి వచ్చేసింది. మరోవైపు, వధువు కుటుంబం జరిగిన ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో, అప్పటికప్పుడు సంభాల్‌కు చెందిన మరో యువకుడితో సంబంధం కలుపుకుని అదే ముహూర్తానికి పెళ్లి ఖరారు చేసింది. దీంతో ఇద్దరు వరులు ఒకేసారి మండపానికి చేరుకున్నారు.

పోలీసుల ఎంట్రీతో సుఖాంతం

మొత్తం కథ విన్న పోలీసులు.. తుది నిర్ణయం తీసుకునే అవకాశాన్ని వధువు కుటుంబానికే వదిలేశారు. తాము కొత్తగా మాట్లాడుకున్న సంబంధానికే కట్టుబడి ఉన్నామని, సంభాల్ వరుడితోనే పెళ్లి జరిపిస్తామని వధువు కుటుంబం తేల్చిచెప్పింది.

దీంతో ఇక తమకు అక్కడ స్థానం లేదని గ్రహించిన మొరాదాబాద్ వరుడి కుటుంబం, ఎలాంటి గొడవ చేయకుండా అక్కడి నుంచి వెనుదిరిగింది. ఇరువర్గాలు ఒక పరస్పర అవగాహనకు రావడంతో ఎవరూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మొత్తానికి ఆ తర్వాత సంభాల్ వరుడితో వధువు వివాహం ప్రశాంతంగా జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement