త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGCSB raids Delhi | ఢిల్లీలో ఫేక్ కాల్ సెంటర్లపై మెరుపుదాడులు.. 21 మంది తెలుగు టెలీకాలర్లు అరెస్ట్

బజాజ్ ఫైనాన్స్ పేరుతో తెలుగు ప్రజలను మోసం చేస్తున్న భారీ సైబర్ ముఠాను ఢిల్లీలో టీజీసీఎస్బీ పట్టుకుంది. 21 మంది మహిళా టెలీకాలర్లు అరెస్ట్ అయ్యారు.

J

Telangana | Published On Aug 10, 2026, 11.00 pm IST

TGCSB raids Delhi | ఢిల్లీలో ఫేక్ కాల్ సెంటర్లపై మెరుపుదాడులు.. 21 మంది తెలుగు టెలీకాలర్లు అరెస్ట్
Advertisement
  • ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న 3 ఫేక్ కాల్ సెంటర్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) మెరుపుదాడులు
  • బజాజ్ ఫైనాన్స్ రుణాలు ఇస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న 21 మంది తెలుగు మహిళా టెలీకాలర్ల అరెస్ట్
  • తెలంగాణలో నమోదైన 22 సైబర్ క్రైమ్ కేసులతో ఈ ముఠాకు నేరుగా సంబంధాలు ఉన్నట్లు అధికారుల గుర్తింపు
  • ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని తెలంగాణ పోలీసుల సూచన

TGCSB raids Delhi | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీ (Delhi) కేంద్రంగా తెలుగు రాష్ట్రాల ప్రజలే టార్గెట్‌గా రెచ్చిపోతున్న భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రట్టు చేసింది. ప్రముఖ సంస్థ బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance) ప్రతినిధులమంటూ ఫోన్లు చేసి, సులభంగా లోన్స్ ఇస్తామని నమ్మించి లక్షలు కొల్లగొడుతున్న 3 ఫేక్ కాల్ సెంటర్లపై టీజీసీఎస్బీ అధికారులు ఏకకాలంలో మెరుపుదాడులు నిర్వహించారు. ఈ భారీ ఆపరేషన్‌లో ఏకంగా 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలీకాలర్లతో (Telecallers) పాటు, మోసాలకు సహకరిస్తున్న ఒక బ్యాంక్ అకౌంట్ హోల్డర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ప్రధాన నిర్వాహకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

అసలు ఎలా మోసం చేస్తున్నారు?

ఈ కేటుగాళ్ల మోడస్ ఆపరెండీ (Modus Operandi) చాలా పకడ్బందీగా సాగుతోంది. ముందుగా కస్టమర్లకు ఫోన్ చేసి, తక్కువ వడ్డీకే ఆకర్షణీయమైన రుణాలు (Loans) ఇస్తామని నమ్మిస్తారు. అవతలి వ్యక్తులు లోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తే.. వెంటనే వాళ్ల అసలు ఆట మొదలుపెడతారు. ప్రాసెసింగ్ ఫీజు (Processing fee), వెరిఫికేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు, ఇన్సూరెన్స్ ప్రీమియం.. ఇలా రకరకాల పేర్లతో ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేస్తారు.

డబ్బులు కట్టాక బ్లాక్ మెయిల్స్..

బాధితులు వాళ్లు అడిగినంత అమౌంట్ (Amount) చెల్లించిన తర్వాత, ఒక్కసారిగా ముఖం చాటేస్తారు. వాళ్లకు కాల్ రాకుండా కాంటాక్ట్ నంబర్లను బ్లాక్ చేస్తారు. అప్పటికీ లోన్ రాలేదని ఎవరైనా గట్టిగా నిలదీస్తే.. వారిని బెదిరించడం, బ్లాక్‌మెయిల్ (Blackmail) చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడుల సమయంలో నిందితుల నుంచి 23 మొబైల్ ఫోన్లు, 2 బ్యాంక్ పాస్‌బుక్‌లను అధికారులు సీజ్ చేశారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల నమోదైన 22 సైబర్ క్రైమ్ కేసులతో ఈ ముఠాకు లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

టీజీసీఎస్‌బీ కీలక హెచ్చరిక

ఈ భారీ స్కామ్ నేపథ్యంలో ప్రజలకు టీజీసీఎస్బీ (TGCSB) కీలక సూచనలు జారీ చేసింది. "ఫోన్‌లో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నారు కదా అని, లేదా మహిళలు కాల్ చేస్తున్నారని గుడ్డిగా నమ్మేయకండి. లోన్ పేరుతో ఆన్‌లైన్‌లో ఎలాంటి ఫీజులు చెల్లించవద్దు. కాల్ చేసిన వ్యక్తి, వాళ్లు చెప్పిన సంస్థ వివరాలను మీరు స్వతంత్రంగా వెరిఫై (Verify) చేసుకోండి" అని అధికారులు హెచ్చరించారు.

ఎవరైనా ఏ రూపంలోనైనా సైబర్ మోసానికి (Cyber Fraud) గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని, లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement
Advertisement