త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay Jaju IAS | తెలంగాణ నూతన సీఎస్‌.. రేవంత్ సర్కార్ గురి ‘మీసేవ’ సృష్టికర్తపైనే

తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (CS) సీనియర్ ఐఏఎస్, 'మీసేవ' రూపకర్త సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్రం నుంచి ఆయనను సీఎం రేవంత్ ఎందుకు రప్పించారంటే?

J

Telangana | Published On Jun 24, 2026, 8.51 pm IST

Sanjay Jaju IAS | తెలంగాణ నూతన సీఎస్‌.. రేవంత్ సర్కార్ గురి ‘మీసేవ’ సృష్టికర్తపైనే
Advertisement
  • తెలంగాణ కొత్త సీఎస్‌గా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు 
  • ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం జూన్ 30, 2026తో ముగియనుండటంతో సీఎం రేవంత్ నిర్ణయం 
  • ఉమ్మడి ఏపీలో ప్రజలకు విశేష సేవలు అందించిన 'మీసేవ' (MeeSeva) వ్యవస్థ రూపకర్త ఈయనే కావడం విశేషం
  • కేంద్ర సర్వీసుల్లో ఆయనకున్న అపార అనుభవం తెలంగాణలోని మూసీ, మెట్రో వంటి ప్రాజెక్టులకు నిధులు తెచ్చేందుకు ఉపయోగపడనుంది

Sanjay Jaju IAS | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary - CS) రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు (Sanjay Jaju) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల (జూన్ 30, 2026) తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి.. సంజయ్ జాజు వైపు మొగ్గు చూపారు. 15 ఏళ్లుగా కేంద్ర సర్వీసుల్లో (Central Deputation) ఉన్న ఆయనను, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) తిరిగి తెలంగాణ కేడర్‌కు బదిలీ చేస్తూ జూన్ 23న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సీనియర్ల ఆశలపై నీళ్లు

సంజయ్ జాజు 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. తదుపరి సీఎస్ రేసులో ఇదే బ్యాచ్‌కు చెందిన సీనియర్లు జయేష్ రంజన్, వికాస్ రాజ్ పేర్లు కూడా బలంగా వినిపించాయి. కానీ, సంజయ్ జాజును కేంద్రం నుంచి రప్పించడంతో ఆ ఇద్దరి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయిందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆ 'మీసేవ' సృష్టికర్త ఈయనే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంజయ్ జాజు సుపరిచితులే. ఐటీ ఆధారిత పౌర సేవలను సామాన్యులకు సైతం చేరువ చేస్తూ ఆయన తీసుకొచ్చిన ఇ-గవర్నెన్స్ (e-Governance) విధానమే నేటి 'మీసేవ' (MeeSeva). 350కి పైగా ప్రభుత్వ సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తెచ్చిన ఈ విప్లవాత్మక ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీనికిగానూ ఆయన 2014లో 'నేషనల్ ఇ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డ్' అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన విజయవాడ సబ్ కలెక్టర్‌గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా, విశాఖపట్నం, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (MCH) కమిషనర్‌గా విశేష సేవలు అందించారు.

రాష్ట్రానికి ఆయనొస్తే లాభమేంటి?

సంజయ్ జాజుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేసిన అపార అనుభవం, బలమైన నెట్‌వర్క్ ఉంది.  నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NHIDCL) డైరెక్టర్‌గా పనిచేసి, దాన్ని పూర్తి డిజిటల్ వ్యవస్థగా మార్చి 2018లో మరోసారి 'గోల్డ్ అవార్డు' గెలుచుకున్నారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ (I&B), ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MDoNER) కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్రంతో ఆయనకున్న ఈ సత్సంబంధాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR), హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, నిధులు సాధించడంలో కీలకం కానున్నాయి.

సంజయ్ జాజు ప్రొఫైల్

పుట్టిన తేదీ: 26 ఫిబ్రవరి 1969 (వయసు 57 ఏళ్లు)

స్వస్థలం: మధ్యప్రదేశ్

విద్యార్హతలు: మెకానికల్ ఇంజనీరింగ్, M.Tech, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (ICWAI), ఫైనాన్స్‌లో MBA.

పదవీ విరమణ: మార్చి 2028.

ప్రత్యేకత: పౌర సేవల్లో సాంకేతికత వినియోగం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ ప్రొడక్షన్, ప్రధాని (PM) అవార్డు గ్రహీత.

Advertisement
Advertisement