త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaddiraju Ravichandra | ఎస్‌ఐఆర్ 10 శాత‌మే పూర్త‌యింది.. ఇంకా స‌మ‌యం పెంచాలి

Vaddiraju Ravichandra | ఎస్‌ఐఆర్ ప్ర‌క్రియ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఐదు నుంచి 10 శాత‌మే పూర్త‌యింద‌ని బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రస్తుతం నెమ్మదిగా సాగుతోందన్నారు.

S

Telangana | Published On Jul 10, 2026, 7.23 pm IST

Vaddiraju Ravichandra | ఎస్‌ఐఆర్ 10 శాత‌మే పూర్త‌యింది.. ఇంకా స‌మ‌యం పెంచాలి
Advertisement
  • ఇదే విష‌యాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి తెలిపాం
  • ఇందుకు ఈసీఐ సానుకూలంగా స్పందించింది
  • బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

Vaddiraju Ravichandra |  త్రినేత్ర‌.న్యూస్‌: ఎస్‌ఐఆర్ ప్ర‌క్రియ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఐదు నుంచి 10 శాత‌మే పూర్త‌యింద‌ని బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రస్తుతం నెమ్మదిగా సాగుతోందన్నారు. ఓటర్ల తొలగింపు, 18 సంవత్సరాలు నిండిన వారి నమోదు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు వంటి అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలంటే అదనపు సమయం అవసరమని అభిప్రాయ‌ప‌డ్డారు. శుక్ర‌వారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమర్థవంతంగా, పారదర్శకంగా పూర్తయ్యేందుకు మరింత సమయం అవసరమని ఎన్నికల సంఘాన్ని కోరాం. ఒకటి నుంచి రెండు నెలల పాటు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశాం. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలు పూర్తిగా ప్రక్షాళన కావాలంటే సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న డూప్లికేట్ ఓటర్ల సమస్యను కూడా పరిష్కరించాలి. తెలంగాణ-మహారాష్ట్ర, తెలంగాణ-కర్ణాటక, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు నమోదైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి లోపాలను ఎస్‌ఐఆర్ ద్వారా సరిదిద్దాల్సిన అవసరం ఉంది అని ఆయ‌న చెప్పారు.

ప్రతి భారత పౌరుడికి దేశవ్యాప్తంగా ఒకే ఓటు ఉండాలన్నదే బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఆలోచన. ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారో అక్కడే ఓటు నమోదు ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల‌ని కోరాం. ప్ర‌స్తుతం బూత్ స్థాయిలో అవసరమైన ఫారాలు, సిబ్బంది, సాంకేతిక సౌకర్యాల కొరత వల్ల ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. ఈ విష‌యాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. ఈ అంశాలపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. పరిస్థితులను పరిశీలించి గడువు పెంపుపై నిర్ణయం తీసుకుంటామ‌ని అధికారులు చెప్పారు అని వద్దిరాజు పేర్కొన్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో గణనీయ సంఖ్యలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు బీఆర్ఎస్‌ పార్టీ గుర్తించింది. కొన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో డూప్లికేట్ ఓటర్ల వివరాలను సేకరించి ఎన్నికల సంఘానికి నివేదిక రూపంలో అందజేశాం. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు పార్టీ అధ్యయనంలో తేలింది. వాటిని తొలగిస్తే ఓటరు జాబితాలు మరింత పారదర్శకంగా మారుతాయి. ఎస్‌ఐఆర్ ప్రక్రియ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, పూర్తిగా నిష్పాక్షికంగా, నిజాయితీగా, ప్రతి అర్హుడైన పౌరుడికి న్యాయం జరిగేలా నిర్వహించాల‌ని బీఆర్ఎస్ తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాం అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వెల్ల‌డించారు.

 

అధికారులను మార్చిన విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం: వినోద్‌కుమార్‌, మాజీ ఎంపీ

ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ విజయవంతం కావాలంటే బూత్ లెవల్ అధికారుల (BLO) పనితీరు బాగుండాలి. ఈ విష‌యాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించాం. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో నియమించిన బూత్ లెవల్ అధికారులకు ప్రక్రియపై పూర్తి అవగాహన లేదు. అవసరమైన ఫారాలు కూడా అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇలాంటి సమస్యలు గుర్తించిన తర్వాత కొంతమంది అధికారులను మార్చిన విషయాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. బీఆర్ఎస్ తరఫున 35 వేల మంది బూత్ లెవల్ అసిస్టెంట్లను నియమించాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆధార్‌ను తప్పనిసరి (Mandatory) చేయడం సాధ్యం కాదని తాము గుర్తిస్తున్నాం. అయినప్పటికీ దాదాపు 99 శాతం మంది ఓటర్లు స్వచ్ఛందంగా ఆధార్ వివరాలను అందిస్తున్నారు. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ఓటరు జాబితాల పారదర్శకతకు ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపాం.

Advertisement
Advertisement