త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Komatireddy | ఫీజు చెల్లించి.. స‌ర్టిఫికెట్లు ఇప్పించి.. గొప్ప మ‌న‌సు చాటుకున్న మంత్రి కోమ‌టిరెడ్డి

Minister Komatireddy | బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని భవితకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు చెల్లించలేక సర్టిఫికెట్లు పొందలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థినికి వెంటనే స్పందించి సాయం అందించారు.

P

Telangana | Published On May 30, 2026, 5.15 pm IST

Minister Komatireddy | ఫీజు చెల్లించి.. స‌ర్టిఫికెట్లు ఇప్పించి.. గొప్ప మ‌న‌సు చాటుకున్న మంత్రి కోమ‌టిరెడ్డి
Advertisement

Minister Komatireddy | బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని భవితకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు చెల్లించలేక సర్టిఫికెట్లు పొందలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థినికి వెంటనే స్పందించి సాయం అందించారు. 10వ తరగతిలో 600కి గాను 582 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచిన భవిత, పాలిసెట్‌లో 634వ ర్యాంక్ సాధించింది. అయితే, కుటుంబ ఆర్థిక ప‌రిస్థితుల కార‌ణంగా స్కూల్ ఫీజు చెల్లించలేకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వ‌లేదు. అయితే, ఈ విష‌యం మంత్రి కోమ‌టిరెడ్డి దృష్టికి చేరింది. దాంతో ఆయ‌న కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేసి పూర్తి వివరాలు సేకరించారు.

అనంతరం స్వయంగా స్కూల్ ప్రిన్సిపల్‌తో ఫోన్‌లో మాట్లాడి, విద్యార్థిని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలలోపు మంత్రి క్యాంప్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ప్రిన్సిపల్ సర్టిఫికెట్లతో హాజరుకాగా, క్యాంప్ కార్యాలయానికి వచ్చిన భవితను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకుని కొంతసేపు చలించిపోయారు. భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగినప్పుడు ఇంజినీరింగ్ చదవాలనే తన ఆశయాన్ని భవిత వివరించింది. ఈ సందర్భంలో వెంటనే స్పందించిన మంత్రి, పెండింగ్‌లో ఉన్న స్కూల్ ఫీజు రూ.60 వేలను అక్కడికక్కడే చెల్లించారు. అలాగే విద్యార్థినికి అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేశారు. పాలిసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు సమీపంలో ఉందని తెలుసుకుని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

తక్షణ అవసరాల కోసం అదనంగా రూ.20 వేలు ఆర్థిక సాయం కూడా అందించారు. భవిష్యత్ చదువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తనను సంప్రదించాలని భవితకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వచ్చిన వీడియో చూడకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ప్రతి మనిషి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. మంత్రి చేసిన సహాయంపై విద్యార్థిని భవిత, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తక్షణమే స్పందించి విద్యార్థి భవిష్యత్‌ను కాపాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్యను వారు ప్రశంసించారు.

Advertisement
Advertisement