త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | వలువలు విప్పుతున్నానన్న రేవంత్‌రెడ్డి.. విలువల గురించి మాట్లాడుతున్న‌డు : కేటీఆర్‌

KTR | వలువలు విప్పుతున్నానన్న రేవంత్‌రెడ్డి.. ఇవాళ విలువల గురించి మాట్లాడుతున్న‌డ‌ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభా విలువలు, మర్యాదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇదే శాసనసభలో మహిళా జర్నలిస్టుల గుడ్డలు ఊడదీస్తా అన్న రేవంత్‌రెడ్డి.. ఇవాళ సభా మర్యాదలు, విలువల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

P

Telangana | Published On Sep 7, 2026, 7.13 pm IST

KTR | వలువలు విప్పుతున్నానన్న రేవంత్‌రెడ్డి.. విలువల గురించి మాట్లాడుతున్న‌డు : కేటీఆర్‌
Advertisement

KTR | వలువలు విప్పుతున్నానన్న రేవంత్‌రెడ్డి.. ఇవాళ విలువల గురించి మాట్లాడుతున్న‌డ‌ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభా విలువలు, మర్యాదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇదే శాసనసభలో మహిళా జర్నలిస్టుల గుడ్డలు ఊడదీస్తా అన్న రేవంత్‌రెడ్డి.. ఇవాళ సభా మర్యాదలు, విలువల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బహిరంగ సభలోనే కాదు.. శాసనసభలో బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి నీకు హుందాతనం ఉందా? నీకు సభను నడిపే సంస్కారం ఉందా? సభను నడిపే ఆలోచన ఉందా? ఆలోచన ఉంటే ఫస్ట్‌ అవర్‌లో క్షమాపణలు చెప్పు. వర్డ్స్‌ విత్‌డ్రా చేసుకో. జరిగిన దాడికి వెంటనే బాధ్యులు ఎవరో పోలీసులు ఉన్నరో.. వారిపై చర్యలు తీసుకో. సభను సాఫీగా నడుపుకుందం. ప్రజల సమస్యలపై చర్చిద్దాం’’ అని డిమాండ్‌ చేశారు. ‘‘మాపై దాడి చేసి.. ఒక్కొక్కరిని కొట్టి, గిల్లి, గీరారు. యాదవరెడ్డికి గోరులేచిపోయింది. రక్తంరావడంతో చికిత్సకు వెళ్లారు. జగదీశ్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయితే ఆసుపత్రికి తీసుకుపోనివ్వరు. డాక్టర్‌ సంజయ్‌కి గాయమైంది. ఇంత చేసి దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ముఖ్యమంత్రి నీతులు చెబుతున్నడు. నిరసన తెలిపే హక్కే ఏడో గ్యారంటీ అంటివి. ప్రజాపాలన ఇంకా ఏదో అంటివి. కానీ, ఇవాళ నీచ రాజకీయాలు చేస్తున్నరు. చీరలు లాగడమే మీరు చేసి చెబుతున్న ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాస్వామ్యమా? ఆడకూతుళ్ల చీరలు లాగడం, గొంతులు పట్టుకోవడం, జుట్టులాగడమే ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాస్వామ్యమా? ఇదేనా మీ ప్రభుత్వానికి ఉన్న ఇంగితం’’ అని ప్రశ్నించారు.

‘నిరసన తెలిపే హక్కు అన్నరు ఇదేనా?’

సభలో చర్చకు అవకాశం ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ‘‘ఇవాళ మమ్మల్ని గేటు వద్ద అడ్డుకోకుంటే, ఇబ్బంది పెట్టకుంటే సభలో సాఫీగా చర్చ జరిగేది కదా? సభలోనే అన్ని విషయాలు మాట్లాడేవాళ్లం. స్పీకర్‌ కూడా చెప్పాలా. రాహుల్‌, ప్రియాంకా గాంధీలకే ఒక న్యాయం.. బీఆర్‌ఎస్‌కు ఇంకో న్యాయం ఉంటదా? వాళ్లు టీషర్టులు వేసుకోవచ్చు. బొమ్మలు వేసుకోవచ్చు. స్లోగన్స్‌ రాసుకోవచ్చు. పార్లమెంట్‌లో నిరసన తెలుపొచ్చు. కానీ ఇక్కడ వేరే రాజ్యాంగం, చట్టం ఉందా? లోక్‌సభలో ఏం రూల్‌ ఉంటదో.. శాసనసభలో గదే ఉంటది. ఇంకో పెద్ద డైలాగ్‌ ఏడో గ్యారంటీ. ఆరు గ్యారంటీలు అయిపోయినయ్‌.. ఏడోగ్యారంటీ ప్రజాస్వామ్యం. నిరసన తెలిపే హక్కు అన్నరు ఇదేనా?’’ అని నిలదీశారు.

అదే మా సంస్కారం..

గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సభలో డీకే అరుణకు సంబంధించిన అంశంలో కేసీఆర్‌ క్షమాపణలు చెప్పించారని కేటీఆర్‌ గుర్తుచేశారు. ‘‘మీరు ఏదైనా తప్పు జరిగిందనుకుంటే వెంటనే క్షమాపణలు చెప్పండని ఆదేశిస్తే.. నేను, సహచర మంత్రి జగదీశ్‌రెడ్డి లేచి వర్డ్స్‌ విత్‌డ్రా చేసుకున్నం. కేసీఆర్‌ గారి సంస్కారం ఏంటంటే.. రాహుల్‌గాంధీ పుట్టుకను అవమానిస్తూ బీజేపీ ముఖ్యమంత్రి, అసోం ముఖ్యమంత్రి మాట్లాడితే.. భారత్‌లో ఖండించిన ఏకైక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌. ఎట్ల మాట్లాడుతవ్‌ అని హిమంత బిశ్వశర్మను చీల్చిచెండాడిన నాయకుడు కేసీఆర్‌. అది మా సంస్కారం’’ అని అన్నారు. ‘ఇవాళ జరిగినది చూశారు. ఏమైందని అడిగారు. సబితమ్మ, సునితమ్మను అవమానిస్తుంటే మీరు ఏం చేస్తున్నరని అడిగారు. లేదు సర్‌ డైవర్షన్‌ చేస్తున్నరు.. అనని మాటలు అన్నట్లు తాతా మధుకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నరంటే.. వెంటనే అందులో ఏముంది విచారం వ్యక్తం చేయండి అన్నరు. స్పీకర్‌ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయండి. ఉపసంహరించుకోండని చెప్పారు. ఒక్కమాటలో చెప్పారు దటీజ్‌ కేసీఆర్‌’ అని తెలిపారు.

దళిత డిక్లరేషన్‌పై చర్చ పెట్టాలి

దళితులపై నిజంగా ప్రేమ ఉంటే శాసనసభ సమావేశాల్లో దళిత డిక్లరేషన్‌పై చర్చ పెట్టాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ‘‘ఇవాళ దళిత వ్యతిరేకి అని మాట్లాడుతున్నడు. దళితులపై ఇసుమంత ప్రేమ ఉన్నా.. వెంటనే ఈ శాసనసభ సమావేశాల్లో దళిత డిక్లరేషన్‌పై చర్చపెట్టాలి. మీ మల్లికార్జున్‌ ఖర్గే గారు, మీ పెద్దలు వచ్చారు కదా? దళిత డిక్లరేషన్‌పై చర్చ పెట్టాలి. ఎన్ని అమలు చేసినవ్‌. దళితబంధు ఎత్తేసి అంబేద్కర్‌ అభయహస్తం తెస్తన్నవ్‌. రూ.12లక్షలు ఇస్తనన్నవ్‌ దానిపై చర్చపెట్టు. దళితులకు నువ్వు ఇచ్చిన హామీలు.. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా.. ఇంటింటికి ఆరులక్షలు ఇస్త అన్నవ్‌. గిరిజనులకు ఆరులక్షలు ఇస్తనని హామీ ఇచ్చినవ్‌. అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇస్తనన్నవ్‌ చర్చపెట్టు. దళితులు, గిరిజనులకు 30శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా ఇస్తన్నవ్‌ చర్చపెట్టు’’ అని అన్నారు. ‘‘నిజంగా దళితులు, గిరిజనులపై ప్రేమ ఉంటే దళిత డిక్లరేషన్‌పై రేపు చర్చ పెట్టు పాల్గొంటం. నీ ప్రభుత్వం అసమర్థతను బయటపెడుతం. దళితులు, గిరిజనుల తరఫున తప్పకుండా అన్ని విషయాలు బయటపెడుతం’’ అని స్పష్టం చేశారు. ఎస్సీ-ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుపైనా ప్రభుత్వాన్ని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘‘దళితులపై ఆయన ప్రేమ కురిపిస్తున్నరు. ఎస్సీ-ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తున్నరా? నయి నిధులు ఖర్చుపెడుతున్నరు. మొన్న బడ్జెట్‌ సమావేశాల్లో బయటపెట్టలేదా ఏ రకంగా దారిమళ్లిస్తున్నారో.. ఏరకంగా అసైన్డ్‌ భూములు కూడా దళితులు, గిరిజనుల వద్ద గుంజుకుంటున్నరో’’ అని విమర్శించారు.

బీఏసీని బ‌హిష్క‌రిస్తున్నామ‌ని చెప్పాం..

స‌భలో జరిగిన పరిణామాలకు నిరసనగా బీఏసీని బహిష్కరిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ‘‘బీఏసీ విషయంలో హరీశ్‌రావుకు అసెంబ్లీ సెక్రటరీ ఫోన్‌ చేశారు. వారికి స్పష్టంగా చెప్పాం. ఇవాళ మా ఆడబిడ్డలపై జరిగిన దాడికి నిరసనగా, అనుచిత వైఖరికి నిరసనగా హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి దుర్మార్గమైన దమనకాండకు బీఏసీని బాయ్‌కాట్‌ చేస్తున్నం. రేపటి నుంచి అసెంబ్లీకి వస్తం. నిలదీస్తమని చెప్పం. అన్ని సమస్యలపై నెలరోజులు ప్రభుత్వం శాసనసభను నడపాల్సిందే. ప్రతీ సమస్యపై చర్చించాల్సిందే’’ అని చెప్పారు. 22ఏ పేరుతో జరుగుతున్న దోపిడీ, పాలిటెక్నిక్‌ విద్యార్థులతో చెలగాటమాడుతున్న విధానం, రైతులను ఇబ్బందిపెడుతున్న తీరు, రైతుబీమా తదితర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.

స్పీక‌ర్‌పై అవ‌స‌ర‌మైతే అవిశ్వాస తీర్మానం

శాసనసభ ప్రాంగణంలో జరిగిన దాడి విషయంలో హైకోర్టును ఆశ్రయించామని కేటీఆర్‌ తెలిపారు. ‘‘ఇక్కడ జరిగిన దాడి విషయంలో హైకోర్టుకు వెళ్లాం. న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలుపుతున్నం. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేల విధులను అడ్డుకోవడం, శాసనసభ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని.. ఎందుకు పోలీసులు ఇలా వ్యవహరించారని ప్రశ్నించినట్లుగా మీడియాలో వార్తలు చూశాం’’ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ను కలిసి పోలీసులు, ప్రభుత్వం తరఫున జరిగిన దాడిపై విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. ‘‘ఈ అంశాన్ని వదిలిపెట్టం. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్స్‌, ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వెళ్తాం. ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, వెయ్యిరోజులుగా అట్టర్‌ఫ్లాప్‌ పాలన అందించడంతోపాటు సబ్బండ వర్గాలను మోసం చేసినందుకు ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘వదిలిపెట్టం ఈ ప్రభుత్వం. వెయ్యిరోజుల వైఫల్యాలను వదిలిపెట్టం. సమస్యలు చాలా ఉన్నయ్‌ నెల రోజులు నడిపించండి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. అవ‌స‌ర‌మైతే స్పీక‌ర్‌పై అవిశ్వాసంపై పెట్టేందుకు ఆలోచ‌న చేస్తామ‌ని మీడియా అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు. ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా మాట్లాడితే, విమ‌ర్శిస్తే మైక్ ఇవ్వ‌మ‌న‌డం ప్ర‌జాస్వామ్యంలో స‌రైందేనా? మేం ముఖ్య‌మంత్రికి త‌ప్పెట్లు కొట్టాల్నా అని ప్ర‌శ్నించారు.

Advertisement
Advertisement