త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై రేపు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు..!

KTR | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ పథకాలను నిలిపివేయాలని చూస్తోందని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

P

Telangana | Published On Aug 16, 2026, 8.34 pm IST

KTR | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై రేపు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు..!
Advertisement

KTR | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ పథకాలను నిలిపివేయాలని చూస్తోందని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌ మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో లక్షలాది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక పథకాన్నే ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

కేసీఆర్‌ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర సాయం అందించామని కేటీఆర్‌ గుర్తుచేశారు. రూ.51 వేలతో ప్రారంభమైన ఆర్థిక సాయాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులు సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. పెళ్లిళ్లు జరిగి చాలా కాలమైనా సాయం అందని కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సాయం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం నాలుగుసార్లు గడువు తీసుకున్నా కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు. పేదింటి ఆడబిడ్డలకు సంబంధించిన పథకాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఎందుకు చొరవ చూపలేదని నిలదీశారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కేవలం సంక్షేమ పథకాలు కాదని, పేద కుటుంబాల ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమాలని కేటీఆర్‌ అన్నారు. వాటిని నిలిపివేస్తే ప్రజల నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. రేపటి నిరసనల్లో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. నియోజకవర్గ ఇన్‌చార్జీలు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామం, వార్డులో కాంగ్రెస్‌ నేతలను ‘‘కల్యాణలక్ష్మి ఏమైంది? షాదీ ముబారక్‌ ఏమైంది? తులం బంగారం ఎప్పుడు ఇస్తారు?’’ అని ప్రజలు నిలదీసేలా ప్రచారం చేయాలని కేటీఆర్‌ సూచించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement