త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RGUKT | బాస‌ర ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాలు.. మే 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు

RGUKT | రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ప‌రిధి బాసరతోపాటు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క్యాంప‌స్‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇందులో భాగంగా 2026–27 విద్యా సంవత్సరానికి ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.

G

Telangana | Published On Apr 2, 2026, 9.37 am IST

RGUKT | బాస‌ర ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాలు.. మే 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు
Advertisement

RGUKT | త్రినేత్ర‌.న్యూస్‌: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ప‌రిధి బాసరతోపాటు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క్యాంప‌స్‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇందులో భాగంగా 2026–27 విద్యా సంవత్సరానికి ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ప్ర‌స్తుతం ట్రిపుల్‌ ఐటీ కోర్సుల్లో (IIIT Admissions) ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. మే 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మొత్తం 1,500 మందికి ప్రవేశాలు క‌ల్పిస్తారు.

త్వరలో విడుదలకానున్న పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్‌ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు నాలుగు మార్కుల చొప్పున కలుపుతారు. మే 30న ఎంపికైన వారి జాబితాను ప్ర‌క‌టిస్తారు.

ప్రవేశ అర్హతలు

విద్యార్థులు ప్రథమ ప్రయత్నంలో 2026-ఎస్ఎస్‌సీ, తత్సమాన పరీక్షలో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. 2026 డిసెంబ‌ర్ 31 నాటికి 18 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏండ్లు నిండకూడదు.

రిజర్వేషన్లు

ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ–ఏ 7, బీసీబీ 10, బీసీ–సీ 1, బీసీ–డీ 7, బీసీ–ఈలకు 4 శాతం. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2, ఎన్‌సీసీ విద్యార్థులకు ఒక శాతం, స్పోర్ట్స్‌ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.

ఫీజు వివరాలు

రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రవేశ సమయంలో ఆరోగ్యబీమా, ఇతరాలకు సంబంధించి రూ.3,500 ఇతరులకు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,000 చెల్లించాలి. క్యాషన్ (దీనిని తిరిగి ఇస్తారు) డిపాజిట్‌ కింద ఏ కేటగిరి అభ్యర్థులైనా రూ.2,000 చెల్లించాలి. ఇతర రాష్ట్రాలు, గల్ఫ్‌దేశాల్లో పని చేసేవారి పిల్లలు ఏడాదికి రూ.1.36 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు రూ.3 లక్షలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి.

దరఖాస్తుతోపాటు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, పదో తరగతి హాల్‌టికెట్‌, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కుల ధ్రువవీకరణ పత్రాలు, వికలాంగులైతే వైకల్య నిర్ధారణ పత్రాలు, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.500, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.450, వేరే రాష్ట్రాల వారికి రూ.1,500

ద‌ర‌ఖాస్తు గ‌డువు: మే 10
సెలెక్షన్‌ లిస్టు: మే 30
కౌన్సెలింగ్‌: జూన్‌ 5న
వెబ్‌సైట్‌: https://www.rgukt.ac.in/

Advertisement
Advertisement