త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రైతులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నా.. రేవంత్‌కు క‌నిక‌రం లేదు : హ‌రీశ్‌రావు

Harish Rao | ఆరుగాలం శ్ర‌మించిన పంట నీటిపాలై రైతులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి క‌నీసం క‌నీస క‌నిక‌రం లేద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం క‌ర్నాల్‌ప‌ల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో క‌లిసి ప్రారంభించారు.

P

Telangana | Published On May 10, 2026, 4.41 pm IST

Harish Rao | రైతులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నా.. రేవంత్‌కు క‌నిక‌రం లేదు : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | ఆరుగాలం శ్ర‌మించిన పంట నీటిపాలై రైతులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి క‌నీసం క‌నీస క‌నిక‌రం లేద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం క‌ర్నాల్‌ప‌ల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో క‌లిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను, వానలకు తడిసిన వడ్లను నేత‌లు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ తీరుపై హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. రేవంత్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యింద‌ని, రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా మారింద‌న్నారు. క‌ర్నాల‌ప‌ల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 25 రోజులైంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం రెండులారీలు మాత్ర‌మే వ‌చ్చాయ‌న్నారు.

ధాన్యం కొనేది ఎప్పుడు..

ప‌దిరోజుల‌కోసారి లారీ వ‌స్తే ఇన్ని వ‌డ్లు ఎప్పుడు కొంటార‌ని, ఈ విష‌యంలో రైతులు ఆందోళ‌న చెందుతున్నార‌న్నారు. వ‌ర్షాల‌కు వ‌డ్లు త‌డిసి మ‌ళ్లీ ఆర‌బెట్టినా కొన‌లేని దుస్థితిలో ప్ర‌భుత్వం ఉంద‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామానికి పోయినా రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నార‌ని, రేవంత్ రెడ్డి ఇంతవరకు వడ్ల కొనుగోళ్లపై ఒక్క రోజైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారా? మీ మంత్రులతో ఒక్క మీటింగ్ అయినా చేశారా? అంటూ ప్ర‌శ్నించారు. ఢిల్లీకి పోవడం, హైదరాబాద్‌కు రావ‌డం త‌ప్ప వేరే పనే లేదా? ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టడం తప్ప.. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల కష్టాలు ముఖ్యమంత్రికి, మంత్రులకు పట్టవా? అంటూ ఘాటుగా స్పందించారు. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోళ్లపై సమీక్ష చేశారా? అని నిల‌దీశారు.

లెక్క‌లేదు.. ప‌ట్టింపు లేదు..

ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్క, పట్టింపు లేదని ఆరోపించారు. చిన్నచూపు ఉన్నందు వల్లే ఈ దుస్థితి దాపురించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏసీ రూముల్లో కూర్చుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నార‌ని, ఆయన ఒకసారి పోలీసులను పక్కనపెట్టి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తిరిగితే రైతుల కన్నీళ్లు, కష్టాలు ఏంటో అర్థ‌మ‌వుతాయ‌న్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సర్పంచులే ఇవాళ వడ్లు కొనాలని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఎంత దయనీయంగా, దారుణంగా తయారైందో ఒకసారి అర్థం చేసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న ముఖ్యమంత్రికి.. రైతుల బాధల గురించి ఇంటెలిజెన్స్, పోలీసులు నివేదికలు ఇవ్వడం లేదా? అంటూ ప్ర‌శ్నించారు.

రూపాయి ఇవ్వ‌లే..

మక్కలు, శనగలు, సన్ ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభమే కాలేద‌న్నారు. 35 రోజుల నుంచి సన్ ఫ్లవర్ కొనుగోళ్లు ఆగిపోయాయ‌ని, కుప్పల కింద ఆ పంటకు చెదలు పడుతున్నా ప్రభుత్వానికి కనికరం లేద‌న్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి వల్లే నేడు అది దివాలా తీసింద‌ని.. ఆ సంస్థ ఎన్‌పీఏ కావడంతో బ్యాంకులు అప్పులివ్వడం లేద‌న్నారు. దాంతో దొడ్డిదారిన కోఆపరేటివ్ బ్యాంకు నుంచి మార్క్ ఫెడ్‌కు, అక్కడి నుంచి సివిల్ సప్లైస్‌కు డబ్బులు మళ్లించార‌ని ఆరోపించారు. మీ అవినీతి, తప్పులకు రైతులను బలిచేస్తున్నారా? అంటూ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. రేషన్ షాపుల్లో ఏళ్ల తరబడి నిల్వ ఉన్న సుమారు రూ.500 కోట్ల విలువైన దొడ్డు బియ్యం పురుగులు పట్టి ముక్కిపోయాయ‌ని ఆరోపించారు. వాటిని అమ్మి రికవరీ చేయాలన్న కనీస సోయి, బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి లేద‌న్నారు.

క‌లెక్ట‌రేట్ల‌ను ముట్ట‌డిస్తామ‌ని హెచ్చ‌రిక‌..

ముఖ్యంగా చేగుంట మండలంలోని 10 గ్రామాల్లో వడగండ్ల వాన వల్ల పంటలకు తీవ్ర నష్టం జరిగింద‌ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వరుసగా మూడు యాసంగి సీజన్లలో రైతులు నష్టపోతూనే ఉన్నార‌న్నారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని లారీలు పంపించి, కాంటాలు పెట్టి వడ్లు కొనాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులం అంతా కలెక్టరేట్లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement