త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఢిల్లీకి నజరానా.. రైతులకు జరిమానా: హరీశ్ రావు

Harish Rao | రేవంత్ రెడ్డి పాల‌న ఢిల్లీకి న‌జ‌రానా, రైతుల‌కు జ‌రిమానా అన్న‌ట్లు ఉంట‌ద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హ‌రీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. వడ్ల కుప్పల మీదే రైతులు ప్రాణాలు విడుస్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేద‌ని మండిప‌డ్డారు.

G

Telangana | Published On May 7, 2026, 12.35 pm IST

Harish Rao | ఢిల్లీకి నజరానా.. రైతులకు జరిమానా: హరీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రేవంత్ రెడ్డి పాల‌న ఢిల్లీకి న‌జ‌రానా, రైతుల‌కు జ‌రిమానా అన్న‌ట్లు ఉంట‌ద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హ‌రీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. వడ్ల కుప్పల మీదే రైతులు ప్రాణాలు విడుస్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేద‌ని మండిప‌డ్డారు. ఏసీ రూముల్లో కూర్చుని అబద్ధాలు చెప్పే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చౌటుప్పల్ మార్కెట్‌కు వచ్చి రైతుల గోస వినాల‌ని హిత‌వు ప‌లికారు. తరుగు పెడితే తోలుతీస్తాన‌న్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు బస్తాకు 3 కిలోల కోత పెడుతుంటే ఏంచేస్తున్నాడ‌ని ప్ర‌శ్నించారు. ధాన్యం కొనుగోళ్ల‌ను గాలికి వదిలేసి, యూరియా అమ్మకాలపై నిషేధం పెట్టి `రైతు వారోత్సవాలు` చేయడం సిగ్గుచేట‌ని ఎద్దేశా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ రావు సందర్శించారు. కల్లాల్లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన ఆయ‌న రైతులకు ధైర్యం చెప్పారు. వడ్ల కుప్పల వద్దనే రోజుల తరబడి రైతుల నిరీక్షణ, ఆవేదనను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నెల రోజులైనా వడ్లు కొనడంలేదని, తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు ఆయ‌న దృష్టికి తీసుకొచ్చారు.

రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా..

`రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న‌ది. వడ్ల కుప్పల వద్దే రైతుల గుండెలు ఆగిపోతున్నా, సీఎం రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోళ్లలో ఏనాడూ ఇంతటి దారుణ పరిస్థితులు లేవు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతుబంధు, సాగునీరు, కరెంటు, చివరికి పండిన పంట అమ్ముకునే దాకా అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేం చాలా బాగా వడ్లు కొంటున్నాం, ఎవరికీ ఇబ్బంది లేదు అని గొప్పలు చెప్పారు. అయ్యా ఉత్తమ్.. నేను ఏసీ రూమ్ లో కూర్చుని మాట్లాడటం లేదు. నీ జిల్లాలోని చౌటుప్పల్ మార్కెట్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా.

ఈ తల్లీ, ఈ చెల్లెలు వడ్లు మార్కెట్‌కు తెచ్చి 24 రోజులైంది. 30వ తేదీన మాయిశ్చర్ చూసి పాస్ అన్నాక కూడా 8 రోజులుగా కాంటా పెట్టే దిక్కే లేదు. 44 డిగ్రీల ఎండలో రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తూ, పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇది పూర్తిగా మీ ప్రభుత్వ చేతగానితనమే. మాయిశ్చర్ చూడటానికి పది రోజులు, సంచులివ్వడానికి వారం, కాంటాకు వారం, మిల్లుకు వెళ్లడానికి మరో వారం పడుతోంది. తీరా మిల్లుకు వెళ్లాక తాలు ఉందని చెప్పి లారీకి 4, 5 బస్తాలు కటింగ్ పెడుతున్నారు.

రైతుల గోస వినండి..

అటు మార్కెట్లో తరుగు, ఇటు మిల్లులో కోత.. అసలు మీకు వడ్లు కొనడం చేతన‌వుతుందా?. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. గల్లీలకు వచ్చి రైతుల గోస వినండి. మీ రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే.. ఢిల్లీకి నజరానా, రైతులకేమో జరిమానా అన్నట్టుగా తయారైంది. 69 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కట్టే బదులు రైతులను పట్టించుకోండయ్యా!. తరుగు పెడితే తోలు తీస్తా అన్న సీఎం.. ఇప్పుడు ఎవరి తోలు తీస్తాడో చెప్పాలి. ప్రతి బస్తాకు 2-3 కిలోల తరుగు తీస్తుంటే ఏం చేస్తున్నారు?

మంచిర్యాలలో అకాల వర్షాలకు గోడ కూలి వడ్ల కుప్పల వద్ద ముగ్గురు రైతులు, కొడుకు చనిపోయారు. నల్ల‌గొండ జిల్లాలో వడ్ల కుప్పల మీదనే రైతు గుండె ఆగి చనిపోయాడు. ఇంకెంత మంది బలైతే మీకు సోయి వస్తుంది?. బీఆర్ఎస్ హయాంలో మేము 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. మీరు కొనడం చేతగాక అబద్ధాలు చెబుతున్నారు. నేను మార్కెట్‌కు వస్తున్నానని తెలిసి ఈరోజు 4, 5 లారీలు పంపించారు. మేమొస్తే తప్ప మీరు లారీలు పంపరా?.

ఆ ఘ‌న‌త రేవంత్ రెడ్డిదే..

రైతు భరోసా వారోత్సవాలు అని సిగ్గులేకుండా సంబరాలు చేస్తున్నారు. ఎకరాకు చొప్పున విడతల వారీగా విదిలిస్తూ సంబరాలు ఏ మొహం పెట్టుకుని చేస్తున్నారు?. రైతుబంధు, యూరియా, రుణమాఫీ, కొనుగోళ్లు అన్నీ ఎగ్గొట్టినందుకు చేస్తున్నారా ఈ వారోత్సవాలు?. రాష్ట్ర, దేశ చరిత్రలో యూరియా అమ్మకాలపై నిషేధం విధించిన ఏకైక ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ దే.

కూరగాయలు, ఆయిల్ పామ్ పండించే రైతులకు యూరియా అమ్మొద్దని బోర్డులు పెట్టడం మీ ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనం. మొక్కజొన్నలు, సన్ ఫ్లవర్ కొని నెలలు దాటుతున్నా రైతులకు ఒక్క రూపాయి వేయలేదు. జొన్నలు, శనగలు కొననే లేదు. కానీ 48 గంటల్లో పైసలు వేస్తున్నామని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. కేసీఆర్ గారు కరెంటు, సాగునీరు, రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారు. కానీ మీరు ధాన్యం కొనకుండా జాప్యం చేసి, రైతులు దళారులకు అగ్గువకు అమ్ముకునేలా కుట్ర చేస్తున్నారు.

రైతులు భయపడుతున్నరు..

వాతావరణ శాఖ అకాల వర్షాలు, తుఫాను హెచ్చరికలు జారీ చేస్తోంది. వర్షం వస్తే చౌటుప్పల్ మార్కెట్ అంతా నీట మునిగి వడ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని మార్కెట్లకు సరిపడా లారీలు, గన్నీ బ్యాగులు పంపాలి. మిల్లర్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసి యుద్ధప్రాతిపదికన వడ్లు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.` అని హ‌రీశ్ రావు అన్నారు.

Advertisement
Advertisement