త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రెండు రాష్ట్రాలు ఎద‌గాలి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కాంగ్రెస్ పార్టీలో ఏ కోటా లేదు.. మెరిట్ కోటా మాత్ర‌మే ఉంటుంది.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ వారికే ప‌ద‌వులు ల‌భిస్తాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుల ప్రతి చర్యను గమనిస్తూనే ఉంటాం.. డీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసుకోవద్దు.. పార్టీ విశ్వాసాన్ని దెబ్బ తీయొద్దు అని సీఎం హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Feb 21, 2026, 6.50 pm IST

CM Revanth Reddy | రెండు రాష్ట్రాలు ఎద‌గాలి : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

క‌ష్ట‌ప‌డ్డ వారికే ప‌ద‌వులు
డీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వులను దుర్వినియోగం చేయొద్దు..
పార్టీ విశ్వాసాన్ని దెబ్బ‌తీయొద్దు..
ప్ర‌జ‌ల్లో ఉన్న న‌మ్మ‌కం వ‌ల్లే కాంగ్రెస్ గెలుపు
రాజ్యాంగాన్ని ర‌ద్దు చేసేందుకు బీజేపీ య‌త్నం..
దేశాన్ని, కాంగ్రెస్‌ను విడ‌దీయ‌లేరు..
దేశం ఆత్మ‌నే కాంగ్రెస్
డీసీసీ అధ్య‌క్షుల శిక్ష‌ణా శిబిరంలో రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీలో ఏ కోటా లేదు.. మెరిట్ కోటా మాత్ర‌మే ఉంటుంది.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ వారికే ప‌ద‌వులు ల‌భిస్తాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుల ప్రతి చర్యను గమనిస్తూనే ఉంటాం.. డీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసుకోవద్దు.. పార్టీ విశ్వాసాన్ని దెబ్బ తీయొద్దు అని సీఎం హెచ్చ‌రించారు. “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాలోని హ‌రిత వ్యాలీ రిసార్ట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న పది రోజుల ప్రత్యేక శిక్షణా శిబిరం కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా డీసీసీ అధ్య‌క్షుల‌ను ఉద్దేశించి సీఎం ప్ర‌సంగించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగం ఇదే..

ప్రజా సమస్యలు, పార్టీ సిద్ధాంతాలు చర్చిస్తూ గతం నుంచి భవిష్యత్తుకు స్ఫూర్తి పొందేందుకు 10 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. 141 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చి, భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా నిలిచింది. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజ్యాంగ పరిరక్షణలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది. కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్య్రం, ఇచ్చిన రాజ్యాంగంను ఉప‌యోగించుకుని పుట్టిన పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భార‌త్ అంటున్నాయి. రాజ్యాంగాన్ని ర‌ద్దు చేయాల‌ని, స‌మూలంగా మార్చాల‌ని కుట్ర జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. డీసీసీ అధ్య‌క్షులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సీఎం సూచించారు.

త్యాగాల చ‌రిత్ర గాంధీ కుటుంబానిది..

మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ దేశం కోసం జైలుకు వెళ్లారు. మహాత్మా గాంధీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళు కనీసం లాఠీ కూడా ఎత్తలేదు. కానీ స్వాతంత్య్రం వ‌చ్చాక భార‌తీయులం అని చెప్పుకునే పార్టీకి చెందిన వారి తూటాల‌కు మ‌హాత్మా గాంధీ నేల‌కొరిగారు. గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం సోనియా గాంధీ సర్వం త్యాగం చేసి కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. కష్టం తెలియకుండా పదవులు పొందే అవకాశం ఉన్నా, త్యాగాల చరిత్ర ఉన్నా రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర, ఆయన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కాంగ్రెస్ విజయాలలో ప్రస్తావించాలి. వైఎస్ షర్మిల తెలంగాణలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఏపీలో పార్టీ కోసం కష్టపడుతున్నారు అని సీఎం కొనియాడారు.

వ్యతిరేకించిన వాళ్ళను అణిచివేసే ప్రయత్నం చేయొద్దు..

కష్టం, శ్రమ ఎప్పుడూ ఊరికే పోదు. మమ్మల్ని జిల్లా పార్టీ అధ్యక్షులను చేశారు.. అన్నీ మాకు తెలుసు, ఈ జిల్లాకు మేమే అధిపతులం అనే ధోరణి మానుకోవాలి. డీసీసీలు అంటే అధికారం కాదు ఒక బాధ్యత. ఓ కుటుంబ పెద్దవంటి బాధ్యత. ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉంటారు. అందరినీ సమన్వయం చేసుకున్నప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. వ్యతిరేకించిన వాళ్ళను అణిచివేసే ప్రయత్నం చేయొద్దు అని రేవంత్ రెడ్డి సూచించారు.

నేను ఏనాడు పైరవీ కోసం పని చేయలేదు..

పైరవీలు చేయకపోతే నాయకుల గౌరవం పెరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలి. నేను ఏనాడు పైరవీ కోసం పని చేయలేదు. 16 ఏళ్లలో జ‌డ్పీటీసీ నుంచి సీఎం వరకు ఎదిగాను. కాంగ్రెస్ నాకు అవకాశం ఇచ్చింది. రెండుగా విడిపోయినా కాంగ్రెస్ పార్టీ రొండు చోట్ల బలపడాలి. రెండు రాష్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఎదగాలి. రెండు రాష్ట్రాలు కలిసి ఎదగాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయ‌డం వ‌ల్లే కాంగ్రెస్ గెలుపు..

నేను పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి కలిసి మద్దతు అడిగాను. కలిసికట్టుగా పనిచేయడం వల్లనే రెండున్న‌ర శాతం ఉన్న కాంగ్రెస్ 40 శాతం ఓట్లు తెచ్చుకొని అధికారంలోకి వచ్చింది. 119 నియోజకవర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేయించాం. డీసీసీ అధ్యక్షులుగా బాగా పని చేసిన వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చాం. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చామ‌ని సీఎం గుర్తు చేశారు.

49.83 శాతం బీసీలు సర్పంచ్‌లు..

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, ప్రత్యర్ధి పార్టీకి ఉన్న తేడా 2 శాతం.. అది పార్లమెంట్ ఎన్నికలకు 4 శాతానికి పెరిగింది.. మున్సిప‌ల్ ఎన్నికల్లో 12 శాతానికి పెరిగింది. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఉన్న నమ్మకం వల్లనే ఇది సాధ్య‌మైంది. సర్పంచ్ ఎన్నికల్లో 49.83 శాతం బీసీలు సర్పంచ్‌లు అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో 63 శాతం మంది ఓబీసీలు ఎన్నికయ్యారు. ఇది కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది అని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

దేశం ఆత్మనే కాంగ్రెస్..

దేశాన్ని, కాంగ్రెస్‌ను విడదీయలేరు.. దేశం ఆత్మనే కాంగ్రెస్. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా బీజేపీ కుట్ర చేస్తోంది. సోనియా, రాహుల్‌పైన కేసులు పెట్టి అవమానిస్తోంది. మూడు త‌రాలు ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరమా? రాజకీయంగా గాంధీ కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవడం కోసం బీజేపీ కుట్ర చేస్తోంది. దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల గొంతును నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీఎం మండిప‌డ్డారు.

ఈ ప్ర‌త్యేక శిక్ష‌ణా శిబిరం కార్య‌క్ర‌మంలో టీ పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల,సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీ చందర్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement