త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | తెలంగాణ క‌చ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంట‌ర్

KTR | తెలంగాణ మీ అయ్య జాగీరా..? అని అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు చేసిన‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ క‌చ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరే అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Jun 3, 2026, 1.38 pm IST

KTR | తెలంగాణ క‌చ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంట‌ర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ మీ అయ్య జాగీరా..? అని అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు చేసిన‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ క‌చ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరే అని కేటీఆర్ తేల్చిచెప్పారు. హైద‌రాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించిన మీట్ ది ప్రెస్ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్‌ను ఓ జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్నించ‌గా, ఆయ‌న ఈ విధంగా బ‌దులిచ్చారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ రియాక్ష‌న్.. ఆయ‌న మాట‌ల్లోనే

మీ అయ్య జాగీరా? నేను ఒక్కటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరు. తెలంగాణ భూమి పుత్రుల జాగీరే తెలంగాణ, ఇందులో ఎవరికీ అనుమానం కూడా అక్కర్లేదు. 100 శాతం ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్లు, ఈ నేల కోసం పోరాటాలు చేసినవాళ్లు, ఈ నేల కోసం త్యాగాలు చేసినవాళ్లు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికీ తెలంగాణ ఈ భూమి పుత్రులు, ఇక్కడున్న నాలుగు కోట్ల మంది జాగీరే. కానీ, మీరు రండి ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి... ఉండండి, ఎవరొద్దన్నారు? 10, 12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌రిస్తున్నారంటే మేం మ‌ద్ద‌తు ప‌లికాం. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం అని కేటీఆర్ తెలిపారు.

దీనికి సమాధానం చెప్తారా పవన్ కళ్యాణ్ గారు?

పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నారు. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా ప్రాంతీయవాదం అంటే.. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడాలని పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు, అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని... మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను పట్టుకొని పోతా ఉన్నాడు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్‌కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? అని కేటీఆర్ నిల‌దీశారు.

పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు

ఇంకొన్ని రోజులైతే జనగణమన పాడరు అని. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏమీ లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల. కమ్యూనిస్టిలు కదంతొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్తగాదు, మాకు యుద్ధాలు కొత్తగాదు, త్యాగాలు కొత్తగాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది ఇక్కడ, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఒక సోదరుడిగా ఇంటికి వస్తే హైదరాబాదీ బిర్యానీ పెడతాం..

పవన్‌ను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా డెఫినెట్‌గా గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం. హైదరాబాదీ బిర్యానీ పెడతాం. కానీ, వచ్చి మా సెక్రటేరియట్‌లో కూర్చొని పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోం. 60 ఏళ్లు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో అని కేటీఆర్ గుర్తు చేశారు.

Advertisement
Advertisement