త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Arya Vysya Mahasabha | తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం: అమరవాదిపై శ్యామ్ సుందర్ ఫైర్

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా అమరవాది లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారోత్సవం అట్టర్ ఫ్లాప్ అయిందని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్ విమర్శించారు.

J

Telangana | Published On May 2, 2026, 8.01 pm IST

Telangana Arya Vysya Mahasabha | తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం: అమరవాదిపై శ్యామ్ సుందర్ ఫైర్

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్‌లో శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆంధ్రా నేతల ఆధిపత్యం స్పష్టంగా కనిపించిందని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరవాది లక్ష్మీనారాయణను వ్యతిరేకిస్తూ తెలంగాణకు చెందిన కీలక ఆర్యవైశ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఈ సభను మూకుమ్మడిగా బహిష్కరించారని ఆయన తెలిపారు. అంగబలం, అర్థబలంతో అక్రమంగా గెలిచిన అమరవాది వర్గంపై త్వరలోనే న్యాయపోరాటం చేస్తామని శ్యామ్ సుందర్ హెచ్చరించారు.

Advertisement

Telangana Arya Vysya Mahasabha | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా నాయకుల పెత్తనమే కొనసాగుతోందని, అందుకే తెలంగాణ వైశ్య నేతలు ఈ సభకు దూరంగా ఉన్నారని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యాంసుందర్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మహాసభ అధ్యక్షుడిగా అమరవాది లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ సభ ఆశించిన స్థాయిలో జరగలేదని, పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని శ్యామ్ సుందర్ విమర్శిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ నేతల మూకుమ్మడి బహిష్కరణ

అమరవాది లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్యవైశ్య నేతలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో బహిష్కరించారని శ్యామ్ సుందర్ గుర్తుచేశారు. తద్వారా అమరవాది వర్గానికి తెలంగాణ వైశ్య సమాజం గట్టి బుద్ధి చెప్పిందన్నారు. ఈ సభకు దూరంగా ఉన్న కీలక నేతల్లో వీరు ఉన్నారు.

  • వైశ్య పితామహుడు గంజి రాజమౌళి గుప్తా
  • ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్
  • ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
  • మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా
  • వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ సుజాత
  • వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కోలేటి దామోదర్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, బొల్లం సంపత్ తదితరులు

ప్రోటోకాల్ ఉన్న ముఖ్య నాయకులు సైతం ఈ ‘అక్రమ ఎన్నిక’ను నిరసిస్తూ సభకు దూరంగా ఉండటమే అమరవాది వర్గం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

అమరవాదిది ద్వంద్వ వైఖరి

గత 11 ఏళ్లుగా అమరవాది వర్గం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని శ్యాంసుందర్ మండిపడ్డారు. నిన్నటి వరకు ఆంధ్రా నేతలను తీవ్రంగా విమర్శించిన వారే.. నేడు తమ పదవి కోసం టీజీ వెంకటేష్, కనకరాజు వంటి ఆంధ్ర నాయకుల అండ కోసం పాకులాడటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

"గతంలో శ్రీశైలం సత్రం విషయంలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టిన అమరవాది, ఇప్పుడు తన పదవిని కాపాడుకోవడానికి ఆంధ్రా నేతలను ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. కేవలం 2-3 ఓట్ల సాంకేతిక మెజారిటీతో.. అంగబలం, అర్థబలంతో గెలిచినంత మాత్రాన అది నిజమైన విజయం కాదు. ఎన్నికల్లో నాకు వచ్చిన 520 ఓట్లు నా నీతి నిజాయితీకి ప్రతీకలు" అని ఆయన స్పష్టం చేశారు.

న్యాయస్థానంలో తేల్చుకుంటాం

కేవలం కొద్దిమంది రైస్ మిల్లర్ల నాయకులతో తూతూమంత్రంగా సభ జరుపుకోవడం హాస్యాస్పదమని శ్యాంసుందర్ ఎద్దేవా చేశారు. ఈ అక్రమ పదవి శాశ్వతం కాదని ఆయన హెచ్చరించారు. ఆర్యవైశ్య మహాసభలో జరిగిన అక్రమాలు, అన్యాయంపై త్వరలోనే న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని, తప్పు చేసిన వారికి కోర్టు ద్వారానే బుద్ధి చెబుతామని తేల్చిచెప్పారు.

పదవుల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం కొందరు బానిసలుగా మారవచ్చని, కానీ ఆత్మాభిమానం ఉన్న ఆర్యవైశ్య జాతి ఇలాంటి అన్యాయాన్ని ఎప్పుడూ సహించదని ఆయన అన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ పేరుతో ఆంధ్రా నేతలతో సభ నిర్వహించి అమరవాది వర్గం ఏకాకిగా మిగిలిపోయిందని, భవిష్యత్తులో తమ సత్తా ఏంటో చూపిస్తామని శ్యాంసుందర్ హెచ్చరించారు.

Advertisement
Advertisement