త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | పవర్‌ ప్లేలోనే పరుగులు రాబట్టాల్సిందే.. ఐపీఎల్‌లో ఇప్పుడిదే ట్రెండింగ్‌.. బౌలర్ల ఆయుధం స్లో బాల్స్‌..!

IPL 2026 | ఐపీఎల్‌ 2026 సీజన్‌ తొలి దశ ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం 70 మ్యాచ్‌లతో లీగ్‌ దశ కొనసాగనుండగా.. ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అన్ని జట్లు ఇప్పటివరకు కనీసం ఐదు మ్యాచ్‌లు ఆడిన పరిస్థితి కనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో ప్రతి బంతితో మ్యాచ్‌ గమనమే మారిపోతుండటంతో, ఈ సీజన్‌ ప్రారంభంలోనే జట్ల వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

P

Sports | Published On Apr 18, 2026, 6.15 pm IST

IPL 2026 | పవర్‌ ప్లేలోనే పరుగులు రాబట్టాల్సిందే.. ఐపీఎల్‌లో ఇప్పుడిదే ట్రెండింగ్‌.. బౌలర్ల ఆయుధం స్లో బాల్స్‌..!
Advertisement

IPL 2026 | ఐపీఎల్‌ 2026 సీజన్‌ తొలి దశ ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం 70 మ్యాచ్‌లతో లీగ్‌ దశ కొనసాగనుండగా.. ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అన్ని జట్లు ఇప్పటివరకు కనీసం ఐదు మ్యాచ్‌లు ఆడిన పరిస్థితి కనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో ప్రతి బంతితో మ్యాచ్‌ గమనమే మారిపోతుండటంతో, ఈ సీజన్‌ ప్రారంభంలోనే జట్ల వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లు అయిన సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. పాయింట్ల పట్టికలో వరుసగా ఎనిమిదో, తొమ్మిదో, పదో స్థానాల్లో ఉండడం గమనార్హం. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ముంబయి ఇండియన్స్ మాత్రం తొలి మ్యాచ్‌లో గెలిచిన తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఇటీవల రెండు విజయాలు సాధించినప్పటికీ, ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని క్రికెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

బలంగా కనిపిస్తున్న జట్లు

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల ప్రదర్శన ఆధారంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు బలంగా కనిపిస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్‌ ఆర్‌సీబీ సైతం ఈ సారి మంచి ఫామ్‌లో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండా అజేయంగా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో తొమ్మిది పాయింట్లు ఉన్నాయి. అదే ఎనిమిది పాయింట్లో ఆర్‌సీబీ రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌ మూడోస్థానంలో కొనసాగుతోంది. ఆర్‌సీబీ, ఆర్‌ఆర్‌ జట్ల ఖాతాల్లో పాయింట్లు సమానంగా ఉన్నా రన్‌ రేట్‌ పరంగా ఆర్‌సీబీ మెరుగ్గా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సీఎస్‌కే జట్ల ఖాతాల్లో నాలుగేసి పాయింట్లు ఉన్నాయి. మెరుగైన నెట్‌ రన్‌ రేట్ కారణంగా సన్‌రైజర్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

మ్యాచుల్లో కనిపించిన ట్రెండ్‌ ఇదే..

ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో కొన్ని స్పష్టమైన ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. పవర్‌ప్లేలో గరిష్ట పరుగులు సాధించడంపై జట్లు దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. స్లో పిచ్‌లపై బౌలర్లు స్లో బాల్స్‌ను ప్రధాన ఆయుధంగా చేసుకుంటున్నారు. పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు చేయాలనే వ్యూహం అనేక పాత రికార్డులను తిరగరాస్తోంది. అంతేకాకుండా జట్లు ఇప్పుడు మధ్య ఓవర్లలో కూడా పవర్‌ప్లే తరహా దూకుడు ఆటను ప్రదర్శిస్తున్నాయి. మొదటి దశలోనే 200 ప్లస్‌ స్కోర్లు నమోదు చేసిన జట్ల సంఖ్య గణనీయంగా పెరిగి పాత రికార్డులు పటాపంచలయ్యాయి. ఫాస్ట్ బౌలర్లు వేగాన్ని తగ్గించి స్లో బాల్స్‌ను ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. పరుగుల వేగం పెరగడంతో ఎక్కువ వికెట్లు 7 నుంచి 10 ఓవర్ల మధ్యలో పడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.

గణంకాలు ఇలా..

ఐపీఎల్‌ 2023 నుంచి 2026 వరకు సిక్స్‌ల శాతం స్థిరంగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. టీ20 మ్యాచ్‌లలో భారీ షాట్లపై బ్యాట్స్‌మెన్‌ దృష్టి సారించినట్లుగా స్పష్టమవుతోంది. 2023 సీజన్‌లో సిక్స్‌ల శాతం 14.7గా ఉండగా, 29 మ్యాచుల్లో సగటున 9.5 సిక్స్‌లు నమోదయ్యాయి. 2024లో ఇది 22.4 శాతానికి పెరిగి 51 మ్యాచ్‌లలో సగటున పది సిక్సర్లు నమోదయ్యాయి. 2025లో కూడా ఈ ట్రెండ్ కొనసాగింది. ఆ సీజన్‌లో సిక్స్‌ల శాతం 22.9 శాతానికి చేరగా.. 37 మ్యాచ్‌లలో సగటు 9.5 సిక్స్‌లు నమోదయ్యాయి. 2026లో ఈ దూకుడు మరింత పెరిగి 25.6 శాతానికి చేరింది. అదే సమయంలో 37 మ్యాచ్‌లలో సగటున 10.5 సిక్స్‌లు నమోదయ్యాయి. ఈ గణాంకాలు చూస్తే, ఐపీఎల్‌లో బ్యాటింగ్ మరింత దూకుడుగా మారుతోందని, భారీ షాట్లు ఇప్పుడు మ్యాచ్‌ల ఫలితాలను నిర్ణయించే కీలక అంశంగా మారుతున్నాయని క్రికెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement