త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy, Uttam Kumar Reddy | బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉంది.. స‌ర‌ఫ‌రా పెంచండి: కేంద్ర‌మంత్రికి రేవంత్‌, ఉత్త‌మ్ విన‌తి

CM Revanth Reddy, Uttam Kumar Reddy | బాయిల్డ్ బియ్యాని (Boiled Rice)కి భారీ డిమాండ్ ఉంద‌ని, అవ‌స‌రాల మేర‌కు స‌ర‌ఫ‌రా పెంచాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. ఈమేర‌కు శుక్ర‌వారం వారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని (Prahlad Joshi) క‌లిసి విజ్ఞప్తి చేశారు.

S

News | Published On Apr 17, 2026, 1.51 pm IST

CM Revanth Reddy, Uttam Kumar Reddy | బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉంది.. స‌ర‌ఫ‌రా పెంచండి: కేంద్ర‌మంత్రికి రేవంత్‌, ఉత్త‌మ్ విన‌తి
Advertisement
  • 30 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బాయిల్డ్ రైస్ సేక‌రించండి
  • యాసంగి ధాన్యం మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంది
  • 5 శాతం నూక‌తో స‌ర‌ఫ‌రాకు మేము సిద్ధం
  • పాత బ‌కాయిలు రూ.1,468.96 కోట్లు కూడా ఇవ్వండి
  • కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషికి సీఎం రేవంత్, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విన‌తి

త్రినేత్ర‌.న్యూస్‌: బాయిల్డ్ బియ్యాని (Boiled Rice)కి భారీ డిమాండ్ ఉంద‌ని, అవ‌స‌రాల మేర‌కు స‌ర‌ఫ‌రా పెంచాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. ఈమేర‌కు శుక్ర‌వారం వారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని (Prahlad Joshi) క‌లిసి విజ్ఞప్తి చేశారు. యాసంగి పంట‌కు సంబంధించి తెలంగాణ నుంచి 30 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేక‌రించాల‌న్నారు. యాసంగి పంట‌కు సంబంధించి మొత్తం 30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూక‌తో), 5 ఎల్ఎంటీ రా రైస్ (10 శాతం నూక‌తో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని సీఎం తెలిపారు.

గత ఆరు యాసంగి సీజ‌న్ల‌లో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలించామ‌న్నారు. బాయిల్డ్ రైస్ స‌ర‌ఫ‌రాను పెంచాల‌ని ఇటీవ‌ల కేంద్ర‌ ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఉత్త‌మ్ కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణ‌లో ఈ యాసంగి సీజ‌న్‌లో 90 ఎల్ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుంద‌న్నారు. తెలంగాణ‌లో సాగ‌య్యే యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంద‌ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్‌, ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌హ్లాద్ జోషి సూత్ర‌ప్రాయంగా ఆమోదం తెలిపారు.

2014-15 వ‌ర్షాకాలం పంట అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు. దేశంలోనే వ‌రి ధాన్యం ఉత్పత్తి, సేక‌ర‌ణ‌లో తెలంగాణ అగ్రగామిగా ఉంద‌ని చెప్పారు. ధాన్యం సేక‌రించిన 48 గంట‌ల్లోనే రైతుల‌కు తాము న‌గ‌దు చెల్లిస్తున్నామ‌ని తెలియ‌జేశారు. రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంట‌నే పాత బ‌కాయిలు విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

పిల్లల్లో ర‌క్తహీన‌త‌, పోష‌కాల లోపాల‌ నివార‌ణ‌కు పోష‌కాహార బియ్యాన్ని పాఠ‌శాల‌లు, వ‌స‌తి గృహాలు, ఐసీడీఎస్‌ల ప‌రిధిలో పంపిణీ చేసేవార‌ని.. ఇటీవ‌ల నిలిపివేశార‌న్నారు. దాన్ని తిరిగి వెంట‌నే పునఃప్రారంభించాల‌ని విజ్ఞప్తి చేశారు. ఈ స‌మావేశంలో ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, సెక్రట‌రీ కోఆర్డినేష‌న్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement