త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Banda heatwave | నిప్పుల కొలిమి: అక్కడ ఉదయం 10 గంటలకే లాక్‌డౌన్.. 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

ఉదయం 10 దాటితే చాలు ఆ ఊళ్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతాయి. 48.2 డిగ్రీల ఉష్ణోగ్రతతో దేశంలోనే అత్యంత వేడి ప్రాంతంగా బందా ఎందుకు మారింది?

J

National | Published On May 20, 2026, 2.56 pm IST

Banda heatwave | నిప్పుల కొలిమి: అక్కడ ఉదయం 10 గంటలకే లాక్‌డౌన్.. 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
Advertisement

Banda heatwave | బందా.. ఒకప్పుడు వాతావరణం కాస్త చల్లగానే ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈ జిల్లా.. ఇప్పుడు దేశంలోనే అత్యంత వేడి ప్రాంతంగా (Extreme heat location) రికార్డులకెక్కింది. మంగళవారం మే 19న ఇక్కడ ఏకంగా 48.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై, 1951 నాటి రికార్డులను సైతం బద్దలు కొట్టింది. ఎడారి ప్రాంతాలైన రాజస్థాన్‌లోని చురు, జైసల్మేర్ లాంటి నగరాలను సైతం బందా దాటేసింది. ఈ దెబ్బకు ఉదయం 10 గంటలకే ఆ ఊరు మొత్తం అనధికారిక కర్ఫ్యూ విధించినట్లుగా నిర్మానుష్యంగా మారుతోంది.

స్తంభించిపోయిన దినచర్య

వేడి తీవ్రత ఎంతలా ఉందంటే, అత్తారా టౌన్‌కు చెందిన లఖన్ గుప్తా లాంటి వ్యాపారులు ఉదయం 6 గంటలకే పనులు మొదలుపెట్టి 9 గంటలకల్లా ఇంటికి చేరుకుంటున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై ఒక్కరు కూడా కనిపించరు. "ఏప్రిల్ నుంచి నా బిజినెస్ పూర్తిగా పడిపోయింది. 10 గంటల తర్వాత బందా ఒక ఎడారిలా మారుతుంది. ఉదయం ఒకటి అరా జనాలు కనిపించినా.. మధ్యాహ్నానికి ఊరంతా నిశ్శబ్దం ఆవహిస్తుంది" అని గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల జీవనశైలి పూర్తిగా అస్తవ్యస్తమైంది. పగటిపూట ఎండను తట్టుకోలేక రైతులు రాత్రి పూట ఎల్‌ఈడీ (LED) ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పొలం పనులు చేసుకుంటున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేయడానికి కూలీలు నిరాకరిస్తున్నారు. దీనివల్ల తమ రోజువారీ వేతనాల్లో 40 శాతం కోల్పోవడానికైనా సిద్ధపడుతున్నారు. ఫుడ్ స్టాల్స్ అన్నీ సూర్యాస్తమయం తర్వాతే తెరుచుకుంటున్నాయి. విద్యుత్ వినియోగం విపరీతంగా పెరగడంతో, ఓవర్‌లోడ్ కారణంగా కాలిపోకుండా ఉండేందుకు 1,379 ట్రాన్స్‌ఫార్మర్లపై అధికారులు నిరంతరం నీళ్లు చల్లుతూ వాటిని చల్లబరుస్తున్నారు.

ప్రకృతికి చేసిన ద్రోహమే.. హీట్ ట్రాప్ (Heat Trap)

ఇది కేవలం గ్లోబల్ వార్మింగ్ వల్లే జరిగింది కాదు. దశాబ్దాలుగా స్థానికంగా జరుగుతున్న పర్యావరణ విధ్వంసమే (Ecological destruction) దీనికి ప్రధాన కారణం అని పర్యావరణవేత్తలు తేల్చి చెబుతున్నారు. బందా అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ దినేష్ సాహా చెప్పిన ప్రకారం.. కొండలను పేల్చడం, విచ్చలవిడిగా జరుగుతున్న మైనింగ్, అడవుల నరికివేత వల్లే ఈ విపత్తు ముంచుకొచ్చింది.

పలు విశ్వవిద్యాలయాల అధ్యయనం ప్రకారం, బందా తన దట్టమైన అటవీ విస్తీర్ణంలో సుమారు 17.55% కోల్పోయింది. పచ్చదనం తగ్గడం, క్రషర్ల నుంచి వచ్చే దుమ్ము ధూళి మేఘాల్లా కమ్మేయడం వల్ల (Dust and debris clouds) భూమి ఉపరితలం మీదే వేడి ఇరుక్కుపోతోంది.

నదుల విధ్వంసం.. అడుగంటిన జలాలు

కొండలకే కాదు, నదులకు కూడా ఈ విధ్వంసం తప్పలేదు. 'కెన్' (Ken) నదిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు సుమారు 55,000 టన్నుల ఎర్ర ఇసుకను నదుల నుంచి తోడేస్తున్నారని అంచనా. నదిలో తేమను నిలుపుకునే ఇసుక లేకపోవడంతో, ఆ ప్రాంతమంతా రాతిమయంగా మారి వేడిని మరింతగా గ్రహిస్తోంది.

దీనివల్ల భూగర్భ జలాలు (Groundwater) 120 అడుగుల అట్టడుగుకు పడిపోయాయి. ఒకప్పుడు 10-20 అడుగుల లోతు ఉండే కెన్ నది, ఇప్పుడు కేవలం అర మీటరుకు పడిపోయి ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోతోంది.

పచ్చదనం మాయమై, నీటి వనరులు ఎండిపోయి, ఇసుక మైదానాలు పెరగడం వల్లే బందా ఇప్పుడు ఒక ప్రమాదకరమైన 'హీట్ ఐలాండ్' (Heat island) లా మారిందని లక్నో యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్ ధృవ్ సేన్ సింగ్ స్పష్టం చేశారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాతే మళ్లీ అత్తారా మార్కెట్‌లో బండి చప్పుళ్లు, జనాల అలికిడి మొదలవుతోంది. పరిస్థితిని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో బందాలో మనుషులు నివసించడం అసాధ్యంగా మారుతుందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement