త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jodhpur Sisters Suicide on Wedding Day | పెళ్లి పీటలు ఎక్కాల్సిన వేళ.. అనంత లోకాలకు : అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదే రోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

J

National | Published On Feb 22, 2026, 4.05 pm IST

Jodhpur Sisters Suicide on Wedding Day | పెళ్లి పీటలు ఎక్కాల్సిన వేళ.. అనంత లోకాలకు : అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
Advertisement

Jodhpur Sisters Suicide on Wedding Day | త్రినేత్ర.న్యూస్ : ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాల్సిన వేళ మరణ మృదంగం వినిపించింది. పట్టువస్త్రాలు ధరించి పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఇద్దరు యువతులు.. పెళ్లికి కొన్ని గంటల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా మనాయి గ్రామంలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అసలేం జరిగింది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనాయి గ్రామానికి చెందిన శోభ (25), విమల (23) అనే ఇద్దరు సోదరీమణులకు శనివారం వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం రాత్రి వరకు ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. బంధువుల రాకతో ఇల్లు కళకళలాడింది. అయితే, శనివారం ఉదయం పెళ్లి వేడుకలు ప్రారంభం కావాల్సిన సమయంలో ఈ ఇద్దరు సోదరీమణులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారు విషం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

కుటుంబ సభ్యుల ఒత్తిడే కారణమా?

ఈ ఘటనపై బాధితుల మేనమామ జస్వంత్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పెళ్లి విషయంలో తండ్రి వైపు బంధువుల నుంచి తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉందని ఆయన ఆరోపించారు. గతంలో కుదిరిన కొన్ని సంబంధాలు రద్దవ్వడం, ఆ తర్వాత తలెత్తిన గొడవల కారణంగా ఈ యువతులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పెళ్లి ఇష్టం లేకనా లేదా ఇతర కుటుంబ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంత్యక్రియలకు సిద్ధమవుతున్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పెళ్లి రోజే ఇద్దరు కూతుళ్లు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Advertisement
Advertisement