త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Heatwave 2026 | సన్‌రెడ్ అలర్ట్.. ఉదయం 11:30 నుంచి సాయంత్రం 4 వరకు బయటికి రావద్దు

దేశవ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. ఢిల్లీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

J

National | Published On May 17, 2026, 10.00 pm IST

India Heatwave 2026 | సన్‌రెడ్ అలర్ట్.. ఉదయం 11:30 నుంచి సాయంత్రం 4 వరకు బయటికి రావద్దు
Advertisement
  • అగ్నిగుండంగా మారుతున్న దేశం
  • తెలంగాణలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
  • మే 19 నుంచి 24 వరకు పెరగనున్న ఎండల తీవ్రత
  • వాతావరణ శాఖ హెచ్చరిక

India Heatwave 2026 | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ మొదలుకొని దేశ రాజధాని ఢిల్లీ వరకు సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాబోయే వారం రోజుల పాటు ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మే నెల చివరికి వస్తున్నా.. భానుడి భగభగలు ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా రాబోయే ఐదు రోజులు అత్యంత తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణలో ఎండల తీవ్రత

తెలంగాణలో కూడా ఎండల తీవ్రత విలవిలలాడిస్తోంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పల్లెలు, పట్టణాల రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' జారీ చేయగా, మరో 16 జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో వడగాలుల ప్రభావంతో పాటు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒక ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ నమోదైతే దానిని 'హీట్ వేవ్'గా పరిగణిస్తారు. కూలీలు, వ్యవసాయదారులు ఉదయం పూట పనులు ముగించుకుని ఇళ్లకే పరిమితమవుతున్నారు.

పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు

ఓవైపు ఎండలు భగ్గుమంటున్నా.. మరో వైపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిలాల్లకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఢిల్లీలో నిప్పుల వాన

న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం లెక్కల ప్రకారం, ఢిల్లీలో రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర క్రమంగా పెరిగే అవకాశం ఉంది. రాత్రి పూట నమోదయ్యే కనీస ఉష్ణోగ్రతలు కూడా ఇదే స్థాయిలో 2-3 డిగ్రీలు పెరగనున్నాయి. ముఖ్యంగా మే 18న ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయి. మే 19, 20 తేదీల్లో ఉష్ణోగ్రతలు 43-45 డిగ్రీలు గానే ఉంటూ, కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి

రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో మే 22 వరకు ఈ వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. అయితే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు (అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్), అలాగే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి దక్షిణ రాష్ట్రాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం.

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ జాగ్రత్తలు మస్ట్‌

ఈ ఎండల తీవ్రత వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఈ కింది జాగ్రత్తలు తప్పక పాటించండి.

  • మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు వీలైనంత వరకు ఇంటి లోపలే లేదా నీడలోనే ఉండండి.
  • దాహం వేయకపోయినా తరచుగా తగినంత నీళ్లు తాగుతూ ఉండండి.
  • బయటకు వెళ్లేటప్పుడు తేలికపాటి, లేత రంగు కాటన్ బట్టలు ధరించండి.
  • తలకు టోపీ లేదా గొడుగు తప్పనిసరిగా వాడండి.
  • వడదెబ్బ తగలకుండా తల, ముఖం కవర్ అయ్యేలా క్లాత్ కట్టుకోండి.
Advertisement
Advertisement