త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Japan Tsunami Warning | దూసుకొస్తున్న సునామీ.. ఎక్కడివక్కడ నిలిచిన బుల్లెట్ రైళ్లు.. జపాన్‌లో అల్లకల్లోలం

జపాన్ ఈశాన్య తీరంలో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందుజాగ్రత్తగా బుల్లెట్ రైళ్ల సేవలు నిలిపివేశారు.

J

International | Published On Apr 20, 2026, 4.36 pm IST

Japan Tsunami Warning | దూసుకొస్తున్న సునామీ.. ఎక్కడివక్కడ నిలిచిన బుల్లెట్ రైళ్లు.. జపాన్‌లో అల్లకల్లోలం
Advertisement

Japan Tsunami Warning | త్రినేత్ర.న్యూస్ : జపాన్‌ ఈశాన్య తీరంలో సోమవారం 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడుతుండటంతో అధికారులు తక్షణ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం రవాణా సేవలను నిలిపివేసి, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

తీరానికి చేరుకుంటున్న సునామీ అలలు

జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపిన వివరాల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో 10 కి.మీ లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైంది. ఇవాటే ప్రిఫెక్చర్‌లోని కుజీ నౌకాశ్రయంలో ఇప్పటికే సుమారు 80 సెంటీమీటర్ల (2.6 అడుగులు) మేర సునామీ అలలు తీరాన్ని తాకగా, సమీపంలోని మరో పోర్టులో 40 సెంటీమీటర్ల మేర అలలు నమోదయ్యాయి. హొక్కైడో, ఇవాటే ప్రాంతాలకు దాదాపు 3 మీటర్ల ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రంగంలోకి దిగిన ప్రధాని సనే తకైచి

భూకంపం తీవ్రత దృష్ట్యా జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి వెంటనే అత్యవసర టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. "సంభవించిన నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" అని ప్రధాని టోక్యోలో విలేకరులకు తెలిపారు. పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK ఛానెల్‌లో 'సునామీ! వెంటనే ఖాళీ చేయండి!' (Tsunami! Evacuate!) అంటూ నిరంతరం ఫ్లాష్ అలర్ట్‌లు ప్రసారం అవుతున్నాయి. ఓట్సుచి (Otsuchi), కమైషి (Kamaishi) వంటి అనేక పోర్ట్ నగరాల్లో అధికారులు వేలాది మందికి తరలింపు ఆదేశాలు జారీ చేశారు.

నిలిచిపోయిన రవాణా, బుల్లెట్ రైళ్లు

జపాన్ భూకంప తీవ్రత స్కేల్‌పై ఈ తాజా ప్రకంపనలు 'అప్పర్ 5' (Upper 5)గా నమోదయ్యాయి. బలహీనమైన కాంక్రీట్ గోడలు కూలిపోవడం సహా, ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడేంత తీవ్రత దీని సొంతం. ఈ భారీ కుదుపుల కారణంగా టోక్యో, అయోమోరి (Aomori) మధ్య బుల్లెట్ రైలు (Bullet Train) సేవలను నిలిపివేసినట్లు క్యోడో న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

అణు విద్యుత్ కేంద్రాల్లో తనిఖీలు

భూకంపం ధాటికి విద్యుత్ వ్యవస్థలపై పడిన ప్రభావాన్ని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (TEPCO), తోహోకు ఎలక్ట్రిక్ పవర్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. హొక్కైడో, తోహోకు ప్రాంతాలలో ప్రస్తుతం పని చేస్తున్న అణు విద్యుత్ కేంద్రాలు లేవు. అయితే, ప్రస్తుతం మూసివేసి ఉన్న ఒనగావా అణు విద్యుత్ కేంద్రం (Onagawa nuclear power plant) వద్ద ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

జపాన్‌లో నిరంతర ప్రమాద ఘంటికలు

ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు వచ్చే దేశాలలో జపాన్ ముందు వరుసలో ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంత చురుకైన "రింగ్ ఆఫ్ ఫైర్" (Ring of Fire) లో ఈ దేశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలలో 20 శాతం జపాన్‌లోనే సంభవిస్తాయి. 2011లో వచ్చిన వినాశకరమైన భూకంపం, సునామీ కారణంగా ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం కరిగిపోయి రేడియోధార్మిక పదార్థాలు వెలువడి పెను విపత్తు సృష్టించిన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల దృష్ట్యా అధికారులు ప్రాణ, ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశారు.

Advertisement
Advertisement