త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana IT Department Case | ప్రభుత్వ ఆస్తులతో చెలగాటం.. ప్రముఖ ఐటీ సంస్థపై క్రిమినల్ కేసు!

ప్రభుత్వ డేటాను కొత్త సంస్థకు బదిలీ చేయకుండా, డిజిటల్ ఆస్తులను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై 'ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్' సంస్థపై తెలంగాణ ఐటీ శాఖ సీసీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేయగా, సీఈవో సహా ఇతరులు పరారీలో ఉన్నారు.

J

Hyderabad | Published On Apr 28, 2026, 11.30 pm IST

Telangana IT Department Case | ప్రభుత్వ ఆస్తులతో చెలగాటం.. ప్రముఖ ఐటీ సంస్థపై క్రిమినల్ కేసు!

సంక్షిప్త సారాంశం

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రాజెక్ట్ గడువు ముగిసిన తర్వాత, నిబంధనల ప్రకారం దాన్ని కొత్త టెండర్ దక్కించుకున్న సంస్థకు అప్పగించకుండా 'ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ మోసానికి పాల్పడింది. సోర్స్ కోడ్, యూజర్ డేటాను ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించడమే కాకుండా.. డేటాను తమ సొంత యాప్‌కు దారి మళ్లించే ప్రయత్నం చేసింది. దీనిపై ఐటీ శాఖ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రాజెక్ట్స్ చీఫ్‌గా ఉన్న శ్రీనివాసులును అరెస్ట్ చేయగా, ఎండీ శ్రీనివాసరావు కాటూరి, ప్రాజెక్ట్ మేనేజర్ కిరణ్ కుమార్ పరారీలో ఉన్నారు. ఈ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.

Advertisement

Telangana IT Department Case | త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వ ఆస్తులు, డిజిటల్ డేటాతో చెలగాటం ఆడిన ఓ ప్రైవేట్ ఐటీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఒప్పంద కాలపరిమితి ముగిసినా ప్రభుత్వ డేటాను, సోర్స్ కోడ్‌ను కొత్త సంస్థకు బదిలీ చేయకుండా ఇబ్బందులకు గురిచేసిన 'ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్' (Transaction Analysts India Pvt Ltd) పై హైదరాబాద్ సీసీఎస్‌ (CCS) లో క్రిమినల్ కేసు నమోదైంది. నమ్మకద్రోహం, డిజిటల్ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్ట్ హ్యాండోవర్‌కు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించినందుకు సంస్థ ఎండీ, సీఈవో శ్రీనివాసరావు కాటూరితో పాటు ఇతరులపై ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) ఏసీపీ ఏ రామ్ రెడ్డి దర్యాప్తును వేగవంతం చేశారు.

అసలేం జరిగిందంటే

రాష్ట్రానికి చెందిన ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, నిర్వహణ కోసం 2017 జనవరిలో ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థకు ప్రభుత్వం వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 70 లక్షలు చెల్లించింది. ఆ తర్వాత ప్రతి నెలా మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తూ వచ్చింది. 2018 నుంచి మూడు సార్లు ఒప్పందాన్ని పొడిగించుకుంటూ వచ్చిన ఈ సంస్థ కాలపరిమితి చివరగా 2025 మే 31తో ముగిసింది.

ఒప్పంద నిబంధనల ప్రకారం.. గడువు ముగిసిన తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం యూజర్ డేటా, సోర్స్ కోడ్, డిజిటల్ ఆస్తులపై పూర్తి హక్కులు తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయి. అయితే, గడువు ముగియడంతో ప్రభుత్వం పారదర్శకంగా కొత్త టెండర్లను ఆహ్వానించింది. ఇందులో పర్వూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీ (Purview India Consulting and Services LLP) ఎల్ 1 (L1) గా నిలిచి టెండర్ దక్కించుకుంది.

ఓడిపోయి కక్ష సాధింపు.. డేటా చోరీకి యత్నం

ఈ కొత్త టెండర్‌లో పాత సంస్థ అయిన ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ కూడా పాల్గొని విఫలమైంది. టెండర్ దక్కకపోవడంతో ఆ సంస్థ యాజమాన్యం తమ వక్రబుద్ధిని బయటపెట్టింది. టెండర్ నిబంధనల ప్రకారం కొత్త సంస్థకు డేటా అందిస్తామని ముందుగా ఒప్పుకున్నా.. తీరా టెండర్ రాలేదని తెలిశాక అడ్డంకులు సృష్టించడం ప్రారంభించింది.

తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ డేటాను తమ సొంత ఆస్తిగా చెప్పుకునే ప్రయత్నం చేసింది.

నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు, యూజర్ డేటాను తమ ప్రైవేట్ అప్లికేషన్‌కు మళ్లించే కుట్రకు తెరతీసింది.

ప్రాజెక్ట్ హ్యాండోవర్ చేయాలని ప్రభుత్వం ఎన్నిసార్లు ఆదేశించినా బేఖాతరు చేసింది.

ఒకరి అరెస్ట్.. సీఈవో పరారీ

ప్రజా ఆస్తులను, అత్యంత సున్నితమైన ప్రభుత్వ డేటాను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమై సీసీఎస్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సంస్థ ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 25న సంస్థ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎం. శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, కీలక నిందితులైన ఎండీ, సీఈవో శ్రీనివాసరావు కాటూరి, ప్రాజెక్ట్ మేనేజర్ కిరణ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

బ్లాక్ లిస్ట్‌లో పెడతాం: ప్రభుత్వం వార్నింగ్

ఈ మోసపూరిత చర్యలపై ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థకు భారీ జరిమానాలు విధించడం, భవిష్యత్తులో ప్రభుత్వ టెండర్లలో పాల్గొనకుండా పూర్తిగా బ్లాక్‌లిస్టింగ్ (Blacklisting) చేయడం, ప్రభుత్వానికి జరిగిన నష్టానికి పరిహారం వసూలు చేయడం లాంటి కఠిన చర్యలను పరిశీలిస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలకు, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఇలాంటి సంస్థల పట్ల ఎంత కఠినంగానైనా వ్యవహరిస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Advertisement
Advertisement