త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drug Racket in Musheerabad | హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. ముషీరాబాద్‌లో 367 గ్రాముల ‘హాష్ ఆయిల్’ సీజ్.. ఇద్దరి అరెస్ట్!

హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా హాష్ ఆయిల్ (Hash Oil) విక్రయిస్తున్న ముఠా ఆటను టాస్క్‌ఫోర్స్ పోలీసులు కట్టించారు. ఏపీలోని విశాఖ నుంచి సరుకు తెచ్చి నగరంలో అమ్ముతున్న ఒక డీలర్‌తో పాటు, దానిని కొనుగోలు చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.

J

Hyderabad | Published On Mar 8, 2026, 9.16 pm IST

Drug Racket in Musheerabad | హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. ముషీరాబాద్‌లో 367 గ్రాముల ‘హాష్ ఆయిల్’ సీజ్.. ఇద్దరి అరెస్ట్!
Advertisement

Drug Racket in Musheerabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది. ఇందులో భాగంగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారిపై నగర పోలీస్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందాలు డేగకన్ను వేశాయి. తాజాగా ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసాలగడ్డ, హవేలీ సమీపంలో హాష్ ఆయిల్ విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక డ్రగ్స్ విక్రేతను, ఒక వినియోగదారుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా మత్తు పదార్థాలను సీజ్ చేశారు. 53 చిన్న ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేసిన 367 గ్రాముల హాష్ ఆయిల్, ఒక బైక్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Drug Racket in Musheerabad  | విశాఖ నుంచి సరఫరా.. పక్కా స్కెచ్!

పోలీసుల విచారణలో నిందితులు ఈ డ్రగ్స్ దందా ఎలా సాగిస్తున్నారో వెల్లడించారు. గుంటూరుకు చెందిన ప్రధాన నిందితుడు డోవారి జ్యోతి రత్న ప్రదీప్, తన సహచరుడు షేక్ మహబూబ్ బాషాతో కలిసి ఈ చీకటి వ్యాపారం సాగిస్తున్నాడు. వీళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన తంబెలి ఛత్రపతి అలియాస్ తిరుపతి అనే వ్యక్తి వద్ద లీటరు హాష్ ఆయిల్‌ను రూ. 50,000 కు కొనుగోలు చేసేవారు. ఆ ఆయిల్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి, సుమారు 5 గ్రాముల చొప్పున చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసేవారు. డ్రగ్స్ కు బానిసైన యువతను టార్గెట్ చేసి, ఒక్కో ప్యాకెట్‌ను రూ. 2,000 నుంచి రూ. 2,500 వరకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు గడిస్తున్నారు.

పట్టుబడింది ఇలా.. పాత నేరస్థులే!

మార్చి 7వ తేదీన ముషీరాబాద్ ప్రాంతంలో జ్యోతి రత్న ప్రదీప్ డ్రగ్స్ సరఫరా చేసేందుకు వేచి ఉన్నాడు. అదే సమయంలో గోల్కొండ క్రాస్ రోడ్స్‌కు చెందిన కోట విజయ్ కుమార్ అనే వ్యక్తి రూ. 2,000 చెల్లించి ఒక డబ్బా హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తుండగా పోలీసులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు.

Hyderabad Police Bust Drug Racket in Musheerabad 367 Grams of Hash Oil Seized Two Arrested

నిందితుల నేర చరిత్ర

వీరిద్దరికీ గతంలో డ్రగ్స్ కేసులతో సంబంధాలు ఉండటం గమనార్హం.

డోవారి జ్యోతి రత్న ప్రదీప్ (34) - డీలర్: 2022లో గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో హాష్ ఆయిల్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌కు వెళ్లాడు. ప్రస్తుత నగరంలోని యాప్రాల్‌లో ఉన్న బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్నాడు.

కోట విజయ్ కుమార్ (46) - వినియోగదారుడు: 2022లో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో NDPS చట్టం కింద నమోదైన డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.

ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. రాఘవేందర్, సబ్ ఇన్‌స్పెక్టర్ పి. జ్ఞానదీప్, సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును ముషీరాబాద్ పోలీసులకు అప్పగించినట్లు అడిషనల్ డీసీపీ (టాస్క్‌ఫోర్స్) అందె శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement
Advertisement