త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Helmet Bank Hyderabad | చలాన్లతో పాటే అప్పుగా హెల్మెట్.. బేగంపేట ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఐడియా..!

ద్విచక్ర వాహనదారుల ప్రాణ రక్షణే ధ్యేయంగా మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు బేగంపేటలో 'హెల్మెట్ బ్యాంక్'ను ప్రారంభించారు. హెల్మెట్ లేకుండా దొరికితే ఫైన్ వేయడంతో పాటు, 24 గంటల పాటు వాడేందుకు ఉచితంగా హెల్మెట్ అప్పుగా ఇస్తారు.

J

Hyderabad | Published On Feb 24, 2026, 11.11 pm IST

Helmet Bank Hyderabad | చలాన్లతో పాటే అప్పుగా హెల్మెట్.. బేగంపేట ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఐడియా..!
Advertisement

Helmet Bank Hyderabad | త్రినేత్ర.న్యూస్ : ట్రాఫిక్ పోలీసులంటే వాహనాలు ఆపడం, ఫొటోలు తీసి చలాన్లు వేయడం మాత్రమే కాదు.. వాహనదారుల ప్రాణాలను రక్షించడంలోనూ ముందుంటారని నిరూపిస్తున్నారు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు. ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం బేగంపేటలో "హెల్మెట్ బ్యాంక్" అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు సోమవారం ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమం, మంగళవారం నుంచి బేగంపేట పరిధిలో పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది.

హెల్మెట్ బ్యాంక్ ఎలా పనిచేస్తుందంటే?

ట్రాఫిక్ తనిఖీల్లో ఎవరైనా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పట్టుబడితే.. ట్రాఫిక్ పోలీసులు ముందుగా వారి వివరాలను నమోదు చేసుకుంటారు. అనంతరం వారికి ఈ 'హెల్మెట్ బ్యాంక్' నుంచి తాత్కాలికంగా ఒక హెల్మెట్‌ను అప్పుగా (Loan) అందిస్తారు. ఆ వాహనదారుడు 24 గంటలలోపు కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి, పోలీసుల వద్ద అప్పుగా తీసుకున్న హెల్మెట్‌ను తిరిగి బ్యాంక్‌లో జమ చేయాల్సి ఉంటుంది.

దీనిపై మల్కాజిగిరి ట్రాఫిక్-1 డీసీపీ కె.రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. "కేవలం చలానాలు విధించడం మాత్రమే మా లక్ష్యం కాదు, ప్రజల ప్రాణాలను కాపాడటం, వారిలో అవగాహన పెంపొందించడమే మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఈ హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం" అని స్పష్టం చేశారు.

వెనుక కూర్చున్న వారికీ మస్ట్.. వింత సాకులు చెబితే కుదరదు!

రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల మరణాలకు ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని పోలీసుల అధ్యయనంలో తేలింది. తనిఖీల సమయంలో పట్టుబడిన వారు.. 'హడావిడిలో ఇంట్లో మరిచిపోయాం', 'జుట్టు రాలిపోతుంది', 'తల, మెడ నొప్పులు వస్తున్నాయి' అంటూ వింత సాకులు చెబుతున్నారని పోలీసులు వెల్లడించారు.

నిబంధనల ప్రకారం.. బైక్ నడిపే వారే కాకుండా వెనుక కూర్చునే ప్రయాణికులు (పిల్లియన్ రైడర్లు) సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అంతేకాకుండా, 4 సంవత్సరాలు, అంతకు పైబడిన వయస్సు ఉన్న పిల్లలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ట్రాఫిక్ పోలీసులు తేల్చి చెప్పారు.

త్వరలో ఆ ప్రాంతాలకు విస్తరణ..

ప్రస్తుతం బేగంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ 'హెల్మెట్ బ్యాంక్' సేవలను త్వరలో అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాలకు కూడా విస్తరించనున్నట్లు ఏసీపీ జి.శంకర్ రాజు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు డీసీపీ (ట్రాఫిక్-1) లక్ష్మి, బేగంపేట అదనపు ఇన్‌స్పెక్టర్ జి.జనకిరాములు, తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్ సర్దార్ నాయక్, అల్వాల్ ఇన్‌స్పెక్టర్ చ. శంకరయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.

[video width="848" height="478" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-24-at-21.45.50-1.mp4"][/video]

Advertisement
Advertisement