త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saifabad Police Station Attack | సైఫాబాద్ పీఎస్‌లో దాడి నిజమే.. హైకోర్టులో అంగీకరించిన ప్రభుత్వం

సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడిని ప్రభుత్వం హైకోర్టులో అంగీకరించింది.

J

Hyderabad | Published On Sep 16, 2026, 3.18 pm IST

Saifabad Police Station Attack | సైఫాబాద్ పీఎస్‌లో దాడి నిజమే.. హైకోర్టులో అంగీకరించిన ప్రభుత్వం

సంక్షిప్త సారాంశం

సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఆర్ఓ మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్‌పై జరిగిన దాడిని ప్రభుత్వం హైకోర్టులో అంగీకరించింది. ఈ ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, కేసు నమోదుకు కోర్టును ఆశ్రయించామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దాడి జరగలేదంటూ డీసీపీ శిల్పవల్లి చేసిన ప్రకటన అవాస్తవమని బీఆర్ఎస్ లాయర్లు వాదించారు. దాడికి సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను భద్రపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Advertisement

Saifabad Police Station Attack | త్రినేత్ర.న్యూస్ : సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్ఓ మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో దాడి జరిగిన విషయాన్ని ప్రభుత్వం హైకోర్టులో అధికారికంగా అంగీకరించింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వేసిన రిట్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రభుత్వ న్యాయవాది కీలక వాదనలు

బీఆర్ఎస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ భవనం నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, తదుపరి నమోదు చేయాల్సిన కేసుల కోసం కోర్టును ఆశ్రయించామని కోర్టుకు వివరించారు. దీంతో పీఎస్‌లో దాడి జరిగినట్లు ప్రభుత్వం అంగీకరించినట్టయింది.

డీసీపీ ప్రకటనపై వివాదం.. సీసీటీవీ ఫుటేజ్ భద్రతకు ఆదేశం

మొన్నటి వరకు డీజే పర్మిషన్ కోసం వచ్చారని, ఎలాంటి దాడి జరగలేదని డీసీపీ శిల్పవల్లి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డీజే పర్మిషన్ల కోసం పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్‌లోనే తీసుకునే పద్ధతి ఉందని బీఆర్ఎస్ లాయర్లు వాదించారు. దాడి జరగలేదన్న డీసీపీ ప్రకటన పూర్తిగా అవాస్తవమని తేలిందని స్పష్టం చేశారు. దుండగులు మారణాయుధాలతో వచ్చారని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు వాదించగా, వారి వద్ద కత్తులు లేవని ప్రభుత్వ లాయర్ తెలిపారు. ఇరువర్గాల వాదోపవాదాల అనంతరం, సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఘటన జరిగిన నాటి సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను భద్రపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Advertisement
Advertisement