త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy Jamiat Meeting Speech | విద్వేష ప్రసంగాలపై కొత్త చట్టం.. మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే ఊరుకోం: అమిత్ షాకు సీఎం రేవంత్ సవాల్

రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం, భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్వేష ప్రసంగాలను అరికట్టేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కఠిన చట్టం తీసుకురాబోతున్నామని ప్రకటించారు. 4 శాతం రిజర్వేషన్ల రక్షణకు కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు.

J

Hyderabad | Published On Feb 5, 2026, 10.54 pm IST

CM Revanth Reddy Jamiat Meeting Speech | విద్వేష ప్రసంగాలపై కొత్త చట్టం.. మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే ఊరుకోం: అమిత్ షాకు సీఎం రేవంత్ సవాల్
Advertisement

CM Revanth Reddy Jamiat Meeting Speech | "దేశం అభివృద్ధి చెందాలంటే మెజారిటీ, మైనార్టీ ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలి. పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యం. అందుకే విద్వేష ప్రసంగాలకు (Hate Speeches) అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది," అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన 'జమియత్ ఉలమా-యే-హింద్' (Jamiat Ulama-i-Hind) సభలో పాల్గొన్న ఆయన మైనార్టీ సంక్షేమం, రిజర్వేషన్లు, రాజకీయ పరిణామాలపై కీలక ప్రసంగం చేశారు.

విద్వేష ప్రసంగాలపై కొత్త చట్టం

రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. "విద్వేష ప్రసంగాల నియంత్రణ కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నాం. ఏ ఒక్కరి వల్ల దేశం అభివృద్ధి చెందదు, అందరూ కలిసి ఉన్నప్పుడే అది సాధ్యం," అని ఆయన పేర్కొన్నారు.

రిజర్వేషన్లపై అమిత్ షాకు సవాల్

దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మైనార్టీలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని సీఎం గుర్తు చేశారు. "మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా అంటున్నారు. అమిత్ షాకు దమ్ముంటే తెలంగాణలో అధికారంలోకి రావాలని నేను సవాల్ విసిరాను. మా ప్రభుత్వం కులగణన (Caste Census) చేసింది. ఈ సర్వేలో మైనార్టీ జనాభా లెక్కలను కూడా సేకరించాం. ఈ గణాంకాలను సుప్రీంకోర్టుకు అందజేసి, 4 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా న్యాయపరంగా పోరాడతాం," అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

CM Revanth Reddy at Jamiat Meeting New Law Against Hate Speech

గల్లీ నుంచి ఢిల్లీకి మీ వల్లే..

జమియత్ ఉలమా సంస్థ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిందని సీఎం కొనియాడారు. "నేను మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు జమియత్ స్వచ్ఛందంగా సహకరించింది. హిందువులతో పాటు ముస్లింలు కూడా నన్ను గెలిపించి పార్లమెంట్‌కు పంపారు. మీ మద్దతు వల్లే నేను గల్లీ నుంచి ఢిల్లీ వెళ్లగలిగాను. అక్కడ రాహుల్ గాంధీకి తోడుగా మోదీ, అమిత్ షాల నిరంకుశత్వంపై పోరాడాను," అని గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ వల్లే మైనార్టీలకు గుర్తింపు

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మైనార్టీలకు అండగా ఉంటుందని సీఎం తెలిపారు. సల్మాన్ ఖుర్షిద్, అహ్మద్ పటేల్ లాంటి వారు కాంగ్రెస్ లో అగ్ర నాయకులుగా ఎదిగారు. రాష్ట్రంలో అజారుద్దీన్, షబీర్ అలీ లాంటి నేతలకు టికెట్లు ఇచ్చాం. షబీర్ అలీ, అజారుద్దీన్ ఎన్నికల్లో ఓడిపోయినా, వారికి ఎమ్మెల్సీ వంటి పదవులు ఇచ్చి గౌరవించాం. అజారుద్దీన్‌ని మంత్రిని చేశాం. ప్రస్తుతం 8 కార్పొరేషన్ల పదవులను మైనార్టీలకే కేటాయించాం. అయితే, పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మైనార్టీ సోదరులదేనని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

"ఒక పార్టీ తమ ఓట్లను బీజేపీకి 'అవయవ దానం' చేయడం వల్లనే.. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం, సీట్లు భారీగా పెరిగాయి," అని ఎద్దేవా చేశారు. మైనార్టీలు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలని, కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్లే ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement
Advertisement