త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల‌కు నేడు సెల‌వు.. రేపు బ్ల‌డ్ బాత్ త‌ప్ప‌దా..?

Stock Markets | గణేష్ చతుర్థి సందర్భంగా సోమవారం భారత స్టాక్ మార్కెట్ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. దీంతో ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌ రోజులు తగ్గనున్నాయి. దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్‌ సెప్టెంబర్ 15న తిరిగి ప్రారంభమవుతుంది. అనంతరం సాధారణ వారాంతపు సెలవులైన శనివారం, ఆదివారం మార్కెట్లకు సెలవు ఉంటుంది.

S

Business | Published On Sep 14, 2026, 10.48 am IST

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల‌కు నేడు సెల‌వు.. రేపు బ్ల‌డ్ బాత్ త‌ప్ప‌దా..?
Advertisement

Stock Markets | గణేష్ చతుర్థి సందర్భంగా సోమవారం భారత స్టాక్ మార్కెట్ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. దీంతో ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌ రోజులు తగ్గనున్నాయి. దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్‌ సెప్టెంబర్ 15న తిరిగి ప్రారంభమవుతుంది. అనంతరం సాధారణ వారాంతపు సెలవులైన శనివారం, ఆదివారం మార్కెట్లకు సెలవు ఉంటుంది. తదుపరి స్టాక్ మార్కెట్ సెలవు అక్టోబర్‌లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉండనుంది. ఆ తర్వాత దసరా సందర్భంగా మరో సెలవు ఉంటుంది. నవంబర్ 8న దీపావళి లక్ష్మీ పూజ సందర్భంగా కూడా ట్రేడింగ్‌ సెలవు ఉంది. అయితే నవంబర్ 8 ఆదివారం కావడంతో ఆ రోజున ముహూర్త్ ట్రేడింగ్ నిర్వహించనున్నారు. ముహూర్త్ ట్రేడింగ్‌ సమయాలను ఎక్స్ఛేంజీలు ప్రత్యేక సర్క్యులర్‌ ద్వారా తర్వాత ప్రకటించనున్నాయి. నవంబర్ 24న ప్రకాశ్ గురుపురబ్ శ్రీ గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా సెల‌వు ఉంటుంది.

అయితే సోమ‌వారం ఈక్విటీ సూచీల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ మ‌ల్టీ క‌మోడిటీ ఎక్స్‌ఛేంజ్ (ఎంసీఎక్స్) సాయంత్రం సెష‌న్‌లో ఓపెన్ కానుంది. సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 11:30 గంట‌ల వ‌ర‌కు య‌థావిధిగా న్యూయార్క్ సెష‌న్ కోసం ఎంసీఎక్స్‌ను ఓపెన్ ఉంచ‌నున్నారు. అందువ‌ల్ల పెట్టుబ‌డిదారులు బంగారం, క్రూడ్ ఆయిల్‌, సిల్వ‌ర్ వంటి ఇన్‌స్ట్రుమెంట్ల‌లో ట్రేడింగ్ చేయ‌వ‌చ్చు.

భారీగా ఎగ‌బాకిన చ‌మురు ధ‌ర‌లు..

సోమ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్ల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం మార్కెట్లు య‌థావిధిగా ప‌నిచేయ‌నుండగా, రేప‌టి సెష‌న్‌లో బ్ల‌డ్ బాత్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అందుకు ప్ర‌ధాన కార‌ణం ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డ‌మేన‌ని అంటున్నారు. సోమ‌వారం సెష‌న్‌లో అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర ఏకంగా 1.86 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 103 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 2.55 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 102 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. ప‌శ్చిమ ఆసియాలో చ‌మురు స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం ఏర్పడుతుంద‌నే వార్త‌లు వెలువ‌డిన నేప‌థ్యంలో ఈ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియాకు చెందిన ఓ ప్ర‌ధాన ముడి చ‌మురు స‌ర‌ఫ‌రా పైప్‌లైన్‌పై డ్రోన్ దాడులు చోటు చేసుకోవ‌డంతో ఆ దేశ ప్ర‌భుత్వం ఆ పైప్‌లైన్‌ను నిలిపివేసింది. దీంతో ప్రపంచ చ‌మురు స‌ర‌ఫ‌రా మార్కెట్‌లో మ‌రో 4 శాతం లోటు ఏర్ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీని వ‌ల్ల ఆందోళ‌నలు మ‌రింత పెరిగి చ‌మురు ధర‌లు భారీగా ఎగ‌బాకాయి.

రేపు భారీగా బ్ల‌డ్ బాత్‌..?

సోమ‌వారం భార‌త మార్కెట్ల‌కు సెల‌వు అయిన‌ప్ప‌టికీ విదేశీ నిఫ్టీ సూచీ గిఫ్ట్ నిఫ్టీ ప‌నిచేస్తుంది. ఇది అంత‌ర్జాతీయ‌, దేశీయ మార్కెట్ల క‌ద‌లిక‌ల‌కు అనుగుణంగా మార్కెట్ ప‌రిస్థితుల‌ను ప్ర‌తిబింబిస్తుంది. అయితే గ‌త సెష‌న్‌లో గిఫ్ట్ నిఫ్ట్ ముగిసిన స్థాయితో పోలిస్తే ప్ర‌స్తుతం 130 పాయింట్ల‌కు పైగా ప‌త‌న‌మై ఈ సూచీ న‌ష్టాల్లో కొన‌సాగుతోంది. దీంతో మంగ‌ళ‌వారం మార్కెట్‌లో మ‌రోమారు భారీ బ్ల‌డ్ బాత్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. దీనికి తోడు ఆసియా మార్కెట్లు సైతం సోమ‌వారం భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. జ‌పాన్ నిక్కీ225 సూచీ ఏకంగా 1300 పాయింట్ల‌కు పైగా న‌ష్ట‌పోగా, ద‌క్షిణ కొరియా కోస్పి సూచీ 209 పాయింట్లు ప‌త‌న‌మైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్ఎక్స్ 200 సూచీ స్వ‌ల్ప న‌ష్టాల్లో కొన‌సాగుతోంది. అంతర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గడం మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మైంద‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. అయితే సోమ‌వారం సాయంత్రం న్యూయార్క్ సెష‌న్‌లో అమెరికా సూచీలు ఎలా క‌దులుతాయ‌న్న విష‌యం ఉత్కంఠ‌గా మారింది.

Advertisement
Advertisement