త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fake DSP Arrest Hyderabad | ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌నంటూ బెదిరింపులు.. నకిలీ ‘డీఎస్పీ’కి చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు

తాను తిరుపతి డీఎస్పీనని, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌నని నమ్మించి కోట్లాది రూపాయలు మోసం చేసిన ఓ నకిలీ పోలీసును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

J

Hyderabad | Published On Aug 24, 2026, 4.06 pm IST

Fake DSP Arrest Hyderabad | ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌నంటూ బెదిరింపులు.. నకిలీ ‘డీఎస్పీ’కి చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు
Advertisement
  • తిరుపతి జిల్లా డీఎస్పీ అవతారమెత్తి పెట్టుబడుల పేరుతో భారీ మోసాలకు పాల్పడిన కేవీపీ రాజు అరెస్ట్
  • బాధితులు డబ్బులు తిరిగి అడిగితే తాను 'ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్' నంటూ బెదిరింపులు
  • రూ.1.20 కోట్ల మోసం కేసులో 2021 నుంచి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్న హైదరాబాద్ సీసీఎస్ (CCS)
  • నకిలీ వాగ్దానాలు నమ్మి కష్టార్జితాన్ని బోగస్ కంపెనీల్లో పెట్టొద్దని పోలీసుల హెచ్చరిక

Fake DSP Arrest Hyderabad | త్రినేత్ర.న్యూస్ : తాను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పెద్ద ఆఫీసర్‌నని, తిరుపతి డీఎస్పీగా (Dy. SP) పనిచేస్తున్నానంటూ అమాయకులను బురిడీ కొట్టించిన ఓ కరుడుగట్టిన మోసగాడి ఆటలు ఎట్టకేలకు ముగిశాయి. పెట్టుబడుల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టి, ఏళ్ల తరబడి పరారీలో ఉన్న అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కొండూరు రెడ్డి వెంకట్ రాజు (40) అలియాస్ డీఎస్పీ రాజును హైదరాబాద్ (Hyderabad) సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

పెట్టుబడుల పేరుతో వల.. అడిగితే బెదిరింపులు

కేవీపీ రాజు తన అనుచరులతో కలిసి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మోసాలకు తెరలేపాడు. అసలు ఉనికిలోనే లేని బోగస్ కంపెనీల్లో పెట్టుబడులు (Investments) పెడితే తక్కువ టైమ్‌లోనే కళ్లు చెదిరే లాభాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు. బాధితులకు ఎలాంటి అనుమానం రాకుండా సెక్యూరిటీ పేరిట నకిలీ ప్రాపర్టీ డాక్యుమెంట్లు, పోస్ట్ డేటెడ్ చెక్కులు చేతిలో పెట్టేవాడు. తీరా లాభాలు రాక, పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని ఎవరైనా బాధితులు నిలదీస్తే.. "నేను డీఎస్పీని, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ను.. నాపైనే కంప్లైంట్ చేస్తారా?" అంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగేవాడు.

మూడేళ్లుగా పరారీ.. పక్కా స్కెచ్‌తో అరెస్ట్

ఇదే తరహాలో వల వేసిన ఈ నకిలీ డీఎస్పీ.. ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.1.20 కోట్లు వసూలు చేసి ముఖం చాటేశాడు. బాధితుడి ఫిర్యాదుతో 2021లో సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నిందితుడిని తాజాగా ఈఓడబ్ల్యూ (EOW) బృందం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించింది. ఇతనిపై గతంలో తిరుపతి, నెల్లూరు, హైదరాబాద్ (తుకారాంగేట్) పోలీస్ స్టేషన్లలో కూడా క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రజలకు పోలీసుల అలర్ట్ (Public Warning)

ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సీసీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) ప్రజలకు కీలక సూచనలు చేశారు. సైబర్ నేరగాళ్లు, నకిలీ ఆఫీసర్లు చెప్పే మాటలు నమ్మి, అత్యాశతో కష్టార్జితాన్ని బోగస్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు.

Advertisement
Advertisement