త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Errabelli Swarna | సామాన్యుల ర‌క్తం తాగుతుంటే చూస్తూ ఊరుకోం.. ధ‌ర‌లు త‌గ్గే వ‌ర‌కు కొట్లాడుతం

Errabelli Swarna | అంతర్జాతీయ మార్కెట్ నెపంతో కేవలం ఒకే నెలలో పలుమార్లు ఇంధన ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడం దుర్మార్గమ‌ని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తక్షణమే తగ్గించకపోతే మహిళల ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటాలు ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Jun 9, 2026, 3.46 pm IST

Errabelli Swarna | సామాన్యుల ర‌క్తం తాగుతుంటే చూస్తూ ఊరుకోం.. ధ‌ర‌లు త‌గ్గే వ‌ర‌కు కొట్లాడుతం
Advertisement
  • కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే చ‌మురు ధ‌ర‌ల‌ను త‌గ్గించాలి
  • లేదంటే మ‌హిళా శ‌క్తి అంటే ఏంటో చూపిస్తం
  • మహిళల వంటింటి బడ్జెట్‌ను అస్త‌వ్య‌స్తం చేస్తున్న‌రు
  • కార్పొరేట్లకు రాయితీలు.. సామాన్యులపై పన్నుల భారమా?
  • ధరల పెంపుపై మహా నిరసన ర్యాలీలో ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ ధ్వజం

Errabelli Swarna | త్రినేత్ర‌.న్యూస్‌: అంతర్జాతీయ మార్కెట్ నెపంతో కేవలం ఒకే నెలలో పలుమార్లు ఇంధన ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడం దుర్మార్గమ‌ని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మండిప‌డ్డారు. కార్పొరేట్ సంస్థల లాభాల కోసం ప్రజల రక్తాన్ని పిండుతుంటే చూస్తూ ఊరుకోవడానికి మేం చేతకాని వాళ్లం కాదని.. తెలంగాణ మహిళా కాంగ్రెస్ సింహాల‌మ‌ని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తక్షణమే తగ్గించకపోతే మహిళల ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటాలు ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ మంగ‌ళ‌వారం ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుండి గన్ పార్క్ వరకు నిరసన ర్యాలి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు.

నాడు గ్యాస్ ధరలు కొంచెం పెరిగితేనే రోడ్లపైకి వచ్చి నాటకాలు ఆడిన నాయకులు.. ఈరోజు ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ఎక్కడ దాక్కున్నారు? ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఇంకో మాటా? ఇది కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనం. ఈ సుంకాన్ని వెంటనే తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించాలి.
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు.

ఏకంగా నాలుగుసార్లు పెంచారు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా 4 సార్లు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై ధరల భారం మోపడం అత్యంత దారుణం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ వల్లనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చమురు సంస్థలపై ఒత్తిడి తీసుకురావడం లేదు అని స్వ‌ర్ణ నిల‌దీశారు.

నిద్ర లేచింది మొద‌లు ప‌న్నుల బాదుడే..

ఇంధన ధరలు పెరగడం అంటే కేవలం వాహనాల ఖర్చు పెరగడం కాదు.. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పులు, ఉప్పుల ధరలు కూడా అమాంతం పెరిగిపోవడం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి వస్తువుపై పన్నులు బాదుతూ, ధరలు పెంచుతూ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా. సామాన్య మహిళల ఓట్లతో గద్దెనెక్కి.. అదే మహిళల వంటింటి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ఆమె ప్ర‌శ్నించారు.

ఆనాడు నానా యాగి చేశారు..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, 'మహాలక్ష్మి పథకం' ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఆదుకుంటుంటే.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచుతూ మహిళల నడ్డి విరుస్తోంది. గ‌తంలో కాంగ్రెస్ హయాంలో సిలిండర్ ధర తక్కువగా ఉంటేనే బీజేపీ నాయ‌కులు నానా యాగి చేశారు. ఇప్పుడు ధరలు వెయ్యి రూపాయలు దాటినా నోరు మెదపకపోవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం. పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, బడా కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది అని ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ దుయ్య‌బ‌ట్టారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర మహిళా కార్యవర్గ కమిటీ సభ్యులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement