త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | ర‌బీ ధాన్యం కొనుగోళ్ల‌లో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్‌ : మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి

Uttam Kumar Reddy | తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తోందని మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్-1 స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించిందని తెలిపారు. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంగ‌ళ‌వారం సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

P

Telangana | Published On Jun 9, 2026, 6.26 pm IST

Uttam Kumar Reddy | ర‌బీ ధాన్యం కొనుగోళ్ల‌లో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్‌ : మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి
Advertisement
  • రికార్డు స్థాయిలో 75ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యం సేక‌ర‌ణ‌
  • టార్గెట్‌ను పెంచాల‌ని కోరినా కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదు
  • బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ ఆరోపణలు మాని కేంద్రంపై ఒత్తిడి తేవాలి
  • మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి

Uttam Kumar Reddy | తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తోందని మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్-1 స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించిందని తెలిపారు. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంగ‌ళ‌వారం సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ధాన్యం సేకరణ లక్ష్యాలను క్రమంగా తగ్గిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని మంత్రి తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా తాను పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ అధికారులను కలిసి లక్ష్యాలు పెంచాలని కోరినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని మంత్రి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కేంద్ర లక్ష్యాలను మించి భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందని వెల్లడించారు.

75ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌తో రికార్డు..

రబీ 2025-26 సీజన్‌లో తెలంగాణలో 65.91 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చినట్లు అంచనా వేశారు. కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం మాత్రమే నిర్దేశించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రికార్డు సృష్టించిందని తెలిపారు. ఈ కొనుగోళ్ల విలువ రూ.17,917 కోట్లకు చేరిందని, రైతులకు కనీస మద్దతు ధరను నేరుగా చెల్లించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ వాటా 61 శాతంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ 25.03 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, తెలంగాణ దాదాపు మూడు రెట్లు అధికంగా సేకరించిందని ఆయన వివరించారు. రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1 రాష్ట్రంగా నిలవడం రైతుల కృషి, ప్రభుత్వ సమర్థ ప్రణాళికల ఫలితమేన‌న్నారు. ఖరీఫ్, రబీ సీజన్లను కలిపి 2025-26 సంవత్సరంలో మొత్తం 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్ర చరిత్రలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ అత్యున్నత రికార్డు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 295 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిలో ఇది గణనీయమైన భాగమని పేర్కొన్నారు.

రూ.35వేల‌కోట్ల‌కుపైగా మ‌ద్ద‌తు ధ‌ర‌..

రైతులకు మొత్తం రూ.35,077 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 25.20 లక్షల రైతు లావాదేవీలు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. రైతు ఇంటి వద్దకే సేవలు అందించాలనే లక్ష్యంతో ఖరీఫ్‌లో 8,448 కొనుగోలు కేంద్రాలు, రబీలో 8,575 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. దేశంలో రెండో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కంటే తెలంగాణలో 1.7 రెట్లు ఎక్కువ కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు. గత రెండు సంవత్సరాల్లో 3వేల‌కుపైగా కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. రబీ ధాన్యం ఉత్పత్తి 28 శాతం పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సేకరణ లక్ష్యాన్ని 79 లక్షల టన్నుల నుంచి 52 లక్షల టన్నులకు తగ్గించిందని మంత్రి విమర్శించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంపై అదనపు భారం పడిందని అన్నారు. అయినా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాల్లో అదనంగా 57 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.16,645 కోట్ల మద్దతు ధర చెల్లించినట్లు తెలిపారు. కొనుగోళ్ల కోసం 20.86 కోట్ల గన్నీ సంచులు సిద్ధం చేయగా, 18.75 కోట్ల సంచులు వినియోగించబడ్డాయని, ప్రస్తుతం 2.11 కోట్ల సంచులు నిల్వలో ఉన్నాయని మంత్రి తెలిపారు. గన్నీ సంచుల కొరత లేదని స్పష్టం చేశారు.

త‌డిసిన ధాన్యాన్ని కొన్నం..

అకాల వర్షాల కారణంగా తడిసిన 12,557 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రత్యేక చర్యల ద్వారా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి రైతులను ఆదుకున్నామని చెప్పారు. ఆ ధాన్యానికి 12 గంటల్లోనే మద్దతు ధర చెల్లించినట్లు ఉత్త‌మ్ వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించాయని మంత్రి కొనియాడారు. ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా 147 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, వారికి రూ.470.40 కోట్ల కమిషన్ అందిందని తెలిపారు. ”రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కేంద్రాలు కొనసాగుతాయి” అని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ఆరోపణలు మానుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ రైతులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

Advertisement
Advertisement