త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pune Porsche Case | పుణె పోర్షే కేసు: కరెన్సీ నోట్ల దండలతో తండ్రి చిందులు.. మండిపడుతున్న నెటిజన్లు

పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితుడి తండ్రికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. బయటకు రాగానే కరెన్సీ నోట్ల దండలతో ఆ కుటుంబం చేసిన సంబరాలు వైరల్‌గా మారాయి.

J

Crime | Published On May 27, 2026, 2.53 pm IST

Pune Porsche Case | పుణె పోర్షే కేసు: కరెన్సీ నోట్ల దండలతో తండ్రి చిందులు.. మండిపడుతున్న నెటిజన్లు
Advertisement
  • ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ప్రాణాలు బలిగొన్న పుణె పోర్షే ప్రమాదం కేసులో మైనర్ తండ్రి విశాల్ అగర్వాల్‌కు మార్చి 10న బెయిల్
  • జైలు నుంచి బయటకు రాగానే అగర్వాల్ కుటుంబం రెస్టారెంట్‌లో కరెన్సీ నోట్ల దండలు వేసుకుని డ్యాన్స్‌లు చేసిన వీడియో లీక్
  • నిసిగ్గుగా వారు చేసుకున్న ఈ సంబరాల వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపాటు
  • కొడుకు తాగలేదని నిరూపించడానికి బ్లడ్ శాంపిల్స్ మార్చారన్న ఆరోపణలతో అగర్వాల్ దంపతుల అరెస్ట్

Pune Porsche Case | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు ప్రమాదం కేసు (Pune Porsche Case) మళ్లీ తెరపైకి వచ్చింది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మరణానికి కారణమైన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌కు మార్చి 10న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, జైలు నుంచి బయటకు వచ్చిన ఆనందంలో ఆ కుటుంబం చేసుకున్న సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

కరెన్సీ నోట్ల దండలతో డ్యాన్స్‌లు

బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత రోజుల్లో జరిగినవిగా చెబుతున్న కొన్ని దృశ్యాలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఓ లోకల్ రెస్టారెంట్‌లో అగర్వాల్ కుటుంబం, వారి స్నేహితులు పెద్ద పార్టీ చేసుకున్నారు. లైవ్ బ్యాండ్ మధ్యలో 'బొంబాయి సే ఆయా మేరా దోస్త్.. దోస్త్ కో సలామ్ కరో' అనే పాత బాలీవుడ్ పాట మారుమోగుతుండగా.. విశాల్ అగర్వాల్ తన భార్య, కుమారుడితో కలిసి స్టెప్పులేస్తున్న వీడియో ఇది.

ఈ వీడియోలో విశాల్ అగర్వాల్ మెడలో ఒక పూల దండతో పాటు, కరెన్సీ నోట్లతో చేసిన దండ ఉండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తండ్రిని కొడుకు ఎత్తుకుని గాల్లోకి తిప్పుతుండగా వారు పడిన ఆనందం అంతా ఇంతా కాదు. విశాల్ భార్య కూడా మెడలో నోట్ల దండ వేసుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఒకరినొకరు ఎత్తుకుని నవ్వుతూ, చిందులేస్తూ వారు చేసిన ఈ సెలబ్రేషన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) కావడంతో, నెటిజన్లు వారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వీడియో నిజానిజాలు మాత్రం తెలియాల్సి ఉంది.

అసలు అగర్వాల్ దంపతులు ఎందుకు అరెస్టయ్యారు?

ప్రమాదం జరిగిన సమయంలో తమ కొడుకు మద్యం తాగలేదని నిరూపించేందుకు, అగర్వాల్ దంపతులు ఆసుపత్రిలో అతడి బ్లడ్ శాంపిల్స్‌ను (Blood Samples) తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. అలాగే, ప్రమాదానికి బాధ్యత వహించాలంటూ తమ డ్రైవర్‌ను బెదిరించారన్న ఆరోపణలతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

సుదీర్ఘ విచారణ తర్వాత, జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విశాల్ అగర్వాల్‌కు మార్చి 10న బెయిల్ మంజూరు చేసింది. "అప్పీలుదారుడు గత 22 నెలలుగా జైలులో ఉన్న విషయాన్ని గమనించాం. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిల్ మంజూరు చేస్తున్నాం" అని ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే, ఈ కేసులోని సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించకూడదని అగర్వాల్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

అసలేం జరిగింది?

మే 19, 2024న పుణెలోని కల్యాణీ నగర్ ప్రాంతంలో.. ఫుల్లుగా మద్యం సేవించిన ఒక మైనర్ బాలుడు.. తన పోర్షే కారుతో అతివేగంగా దూసుకొచ్చి ఇద్దరిని (అనీష్ అవధీయ, అశ్విని కోస్టా) బలితీసుకున్నాడు. ఈ ఘోర ప్రమాదం జరిగిన కేవలం 15 గంటల్లోనే జువైనల్ జస్టిస్ బోర్డు (JJB) ఆ బాలుడికి బెయిల్ ఇచ్చేసింది. రోడ్డు భద్రతపై 300 పదాలతో ఒక వ్యాసం (Essay) రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని సిల్లీ కండిషన్స్ పెట్టి వదిలేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది.

ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడంతో, ఆ తర్వాత బాలుడిని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. అనంతరం బాలుడి వయసు, నేరం తీవ్రత దృష్ట్యా అతడిని 'మేజర్'గానే పరిగణించి విచారించాలని జూన్ 7న JJB నిర్ణయించింది. అయితే, నెల రోజులకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Feels (@bollywood__feels)

Advertisement
Advertisement